హైదరాబాద్: ఒకప్పటితో పోల్చితే.. ప్రస్తుతం క్రికెటర్లు తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ సహా టీ20 ఫార్మాట్లో ఎన్నో లీగులు వెలుగులోకి రావడంతో అందరూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బయో బబుల్లో ఉండడం ఆటగాళ్లపై మరింత భారం పెరిగింది. విశ్రాంతి లేకుండా మ్యాచ్లను ఆడటమే కాకుండా ఆయా దేశాల్లోని వాతావరణ పరిస్థితులు కూడా ఆటగాళ్లను ఇటు శారీరకంగా.. అటు మానసికంగా అలసిపోయేలా చేస్తున్నాయి. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీలు ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తున్నాయి.
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండో ఎడిషన్ సాగుతోంది. విజయం కోసం అన్ని జట్లూ తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్లే ఆఫ్ లక్ష్యంగా అన్ని జట్లు ఆడుతున్నాయి. ఐపీఎల్ ముగిశాక రెండు రోజుల్లోనే ఇదే వేదికలపై టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభం కానుంది. అసలే తీరిక లేని షెడ్యూల్తో పాటు యూఏఈలో ఉండే వేడి పరిస్థితులతో క్రికెటర్లు చాలా త్వరగా అలసటకు గురవుతున్నారు. దీంతో ఆటగాళ్లను ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ నిర్ణయం తీసుకున్నాయి. క్రికెటర్ల పనిభారం తగ్గించేలా రొటేషన్ పద్ధతిలో మ్యాచ్ల్లో ఆడించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.
అయితే రొటేషన్ పద్ధతికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వలేదని, నిర్ణయం తీసుకోవడం పూర్తిగా ఫ్రాంచైజీల ఇష్టమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ప్రపంచకప్కు ఎంపికైన ఏ భారత ఆటగాడినీ వందశాతం ఫిట్గా లేకుండా ఐపీఎల్లో ఆడించకూడదని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సూచించింది. 'పనిభారం నిర్వహణకు సంబంధించి ఫ్రాంచైజీలకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అది పూర్తిగా ఆటగాడు, ఫ్రాంచైజీకి సంబంధించిన అంశం. ఎవరైనా ఒక క్రికెటర్కు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే.. ఫ్రాంచైజీతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. అలానే క్రీడాకారులను ఎలా చూసుకోవాలో ఫ్రాంచైజీలకు తెలుసు. ఫిట్గా లేకుండా ఐపీఎల్లో ఆడించొద్దు అని సూచించాం' అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.
బీసీసీఐ సూచనల మేరకే టీ20 ప్రపంచకప్ 2021 ఎంపికైన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఇంకా బరిలో దించట్లేదని తెలుస్తోంది. పాండ్యా ఫిట్నెస్ ముంబై జట్టుకే మాత్రమే కాదు టీమిండియాను కూడా కలవరపరిచే అంశమే. టీ20 ప్రపంచకప్ ఎంతో దూరంలో లేని నేపథ్యంలో ఈ స్టార్ ఆల్రౌండర్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించడం ఎంతో ముఖ్యం. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు పాండ్యా సమీపంగా ఉన్నాడని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ చెప్పాడు. ఇది కాస్త ఊరట కలిగించే అంశమే. ఐపీఎల్ ఆడకున్నా.. ప్రపంచకప్ ఆడితే చాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇటీవల శ్రీలంక వన్డే సిరీస్లో 3 వికెట్లే తీసిన పాండ్య.. బ్యాట్తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు.