కొన్ని రోజుల క్రితం వరకూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన ఫామ్లో లేడు. కొన్ని కీలక ఇన్నింగ్సులు ఆడినప్పటికీ అంతర్జాతీయ సెంచరీ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సంవత్సరాలు పోరాడుతూనే ఉండిపోయాడు. ఈ సమయంలో పాక్ సారధి బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ తదితరులు ఫామ్ అందుకున్నారు. దీంతో అందరూ ఇక కోహ్లీ శకం ముగిసందంటూ కామెంట్లు చేశారు.
అయితే ఒక నెలరోజుల విశ్రాంతి తీసుకొని మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టిన కోహ్లీ.. మరోసారి ప్రపంచానికి బాస్ ఎవరో చెప్పడం ప్రారంభించాడు. ఆసియా కప్లో నెమ్మదిగా మళ్లీ ఆటకు అలవాటు పడిన అతను.. టీ20 వరల్డ్ కప్లో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కోహ్లీ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వైట్ బాల్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో శతకం బాదిన అతను.. మూడేళ్ల తర్వాత వన్డే శతకం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ శ్రీలంకతో జరిగిన తొలి వన్డేల కూడా శతక్కొట్టాడు. వీటన్నింటికీ మించి తిరువనంతపురంలో జరిగిన వన్డేలో అతని శతకం అభిమానులను ఉర్రూతలూగించింది.
గత మూడేళ్లలో అంటే 2019 నుంచి ఆడిన తొలి 24 వన్డే ఇన్నింగ్స్లలో కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చెయ్యలేకపోయాడు. కానీ ఇటీవల ఆడిన నాలుగు ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలు సాధించి విమర్శకుల నోళ్లూ మూయించాడు. ఇది చూసిన వాళ్లందరూ ఇక బాబర్ ఆజమ్ పని అయిపోయిందని, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో తన టాప్ ర్యాంక్ కోసం మళ్లీ కోహ్లీ వచ్చేస్తున్నాడని అంటున్నారు. రూట్, స్టీవ్ స్మిత్ తదితరులు ఆడటం చూసి కోహ్లీ కన్నా వాళ్లే బెటరన్ అని చెప్పిన వాళ్లకు కూడా చురకలేస్తున్నారు. బ్లాక్బస్టర్ మూవీ కేజీయఫ్లోని డైలాగ్ చెప్తూ.. 'ఎవ్రీబడీ ఈజ్ ఏ గ్యాంగ్స్టర్.. టిల్ యూ సీ ది మాన్స్టర్' అంటూ కోహ్లీపై మీమ్స్ పేలుస్తున్నారు. సోషల్ మీడియా అంతా కోహ్లీకి దాసోహం అంటూనే ఉంది.