
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన ప్రకటన చేశాడు. క్రికెట్లో కొత్తగా మెగా స్టార్ లీగ్ (MSL)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ టీ10 లీగ్లో దేశీయ, ఇతర దేశాల మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు ఆడతారని పేర్కొన్నాడు. 42ఏళ్ల అఫ్రిది ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2022ఎడిషన్లో చివరిసారిగా ఆడాడు. పీఎస్ఎల్లో తన చివరి సీజన్ ఇదే అంటూ అతను పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ లెజెండరీ ఆల్రౌండర్ పాకిస్థాన్ తరఫున 27టెస్టులు, 398వన్డేలు 99టీ20లు ఆడి ఎన్నో మ్యాచ్ల్లో పాకిస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అతన్ని టీ20 ఫార్మాట్లో దిగ్గజంగా పేర్కొంటుంటారు. బౌలింగ్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా.. క్రీజులో వచ్చీరాగానే సిక్సర్లు కొట్టగల సామర్థ్యం అతని సొంతం. అతను అద్భుతమైన ఫీల్డర్ కూడా. ఇక అతను ప్రకటించిన కొత్త టోర్నీ మెగాస్టార్ లీగ్ (MSL)లో ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ లాంటి మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఆడనున్నారు. దీంతో ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకర్షించడం ఖాయం.
మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు ఆర్థికంగా దోహదపడేందుకే ఈ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు అఫ్రిది పేర్కొన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో రావల్పిండిలో ఈ టోర్నీ ప్రారంభం కానుందని పేర్కొన్నాడు. అలాగే టోర్నమెంట్లో పాల్గొనే పలువురు దిగ్గజాల పేర్లను కూడా తెలిపాడు. ఇప్పటికే పాకిస్థాన్లో జరుగుతు పీఎస్ఎల్ మంచి ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే పీఎస్ఎల్ యువ ప్లేయర్లకు తగినదని అఫ్రిది అన్నాడు. ఇక ఎంఎస్ఎల్ లీగ్లో దేశీయ దిగ్గజాలే కాకుండా విదేశీ మాజీ క్రికెటర్లు, దిగ్గజాలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయని పేర్కొన్నాడు.
ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అఫ్రిది లీగ్ నిర్వహణ వివరాలను తెలిపాడు. 'మెగా స్టార్ లీగ్ ఒక వినోదాత్మక లీగ్. ఇది టీ10ఫార్మాట్లో జరగనుంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్లో రావల్పిండిలో ప్రారంభిస్తాం. ఈ లీగ్ను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, స్పోర్ట్స్ జర్నలిస్టులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం. MSL ఆరు జట్లతో మొదలవుతుంది. విదేశీ ఆటగాళ్ళు కూడా పాల్గొంటారు. పీఎస్ఎల్ అనేది యువకుల కోసం బాగుంటుంది. ఇప్పుడు నేను అంత యువకుడినేం కాదు. ఎంఎస్ఎల్లో నేను ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్-ఉల్-హక్ మరియు వకార్ యూనిస్ ఆడతాము,' అని పేర్కొన్నాడు.