
విరాట్ కోహ్లీ
ఇటీవల కాలంలో భారత జట్టుకు అనేక విజయాలనందిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు తిరుగులేని విజయాలు అందిస్తున్న ఈ ఢిల్లీ క్రికెటర్.. వ్యక్తిగతంగానూ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సారథిగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. టెస్టుల్లో వరుసగా ఐదు సిరీస్ల్లో భారత్కు విజయాలు అందించాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనీ నుంచి అందుకున్న పరిమిత ఓవర్ల నాయకత్వం అందుకున్న కోహ్లీ సత్తా చాటుతున్నాడు.

శేఖర్ నాయక్ (అంధుల క్రికెట్ కెప్టెన్)
కర్ణాటక షిమోగాలోని కుగ్రామంలో పుట్టిన శేఖర్ నాయక్ అంధుల క్రికెట్కు సారథ్యం వహిస్తున్నాడు. చిన్నప్పుడు అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో కుడి కంటి చూపు కోల్పోయిన శేఖర్ క్రమంగా ఆటపై పట్టు పెంచుకున్నాడు. 11ఏళ్ల వయసులో స్కూల్ బాట పట్టిన ఈ కుర్రాడు అక్కడే క్రికెట్లో ఓనమాలు నేర్చాడు. కొత్తగా అనిపించడంతో కోచ్ల సహాయంతో తన బ్యాటింగ్ నైపుణ్యానికి పదునుపెట్టుకున్నాడు. అంధుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ (2014)లో భారత్ను విశ్వవిజేతగా నిలిపాడు.

మరియప్పన్ తంగవేలు
తమిళనాడులోని సేలం జిల్లాలోని పెరివాడంగంపట్టి గ్రామంలో పుట్టిన మరియప్పన్ తంగవేలు కథ ఓ స్ఫూర్తి. తండ్రి నిరాదరణకు గురై తల్లి పెంపకంలో పెరిగిన తంగవేలు.. కష్టాలకు, కన్నీళ్లకు కేరాఫ్ అడ్రస్గా పెరిగాడు. ఆరేళ్ల వయసులో ఓ బస్సు డ్రైవర్ నిర్వాకం వల్ల శాశ్వతంగా కుడికాలును కోల్పోయిన తంగవేలు ఆటల్లో తన అదృష్టాన్ని వెతుక్కున్నాడు. తన ప్రతిభ ముందు వైకల్యమే చిన్నబోయింది. రియో పారాలింపిక్స్లో హైజంప్ టీ-42 ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించాడు.

దీపా కర్మార్కర్
దీపా కర్మార్కర్ ఒలింపిక్స్కు అర్హత పొందిన తొలి మహిళా జిమ్నాస్ట్గా గుర్తింపు పొందింది. రియో ఒలింపిక్స్లో పతకాన్ని తృటిలో చేజార్చుకుంది. త్రిపురలో దిగువ మధ్యస్థాయి కుటుంబంలో పుట్టి పెరిగిన దీప కొండంత ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదిగింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గింది. ప్రమాదరకమైన ప్రొడునోవా విన్యాసాన్ని మూడుసార్లు చేసినా ఫైనల్లో కేవలం 0.15 పాయింట్ల తేడాతో నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దీపా మాలిక్
హర్యానాకు చెందిన దీపా మాలిక్ సాహస క్రీడల్లో అత్యంత ప్రతిభ చూపేది. శరీరంలో తలెత్తిన ఓ రుగ్మత కారణంగా దీప నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దీంతో వీల్చైర్కే పరిమితమైనా తన కలలను మాత్రం ఆపలేదు. ఒక్కో అడుగు వేస్తూ ఒకటిగా ముందుకెళ్తూ కుటుంబ సహకారంతో రియో పారాలింపిక్స్ మహిళల షాట్పుట్-ఎఫ్ 53 ఈవెంట్లో భారత్కు రజత పతకాన్ని అందించింది.

వికాస్ గౌడ
మైసూర్లో పుట్టి అమెరికాలో పెరిగిన వికాస్ గౌడ భారత అథ్లెటిక్స్లో ప్రధాన ఆటగాడు. డిస్కస్ త్రో, షాట్పుట్ రెండింటిలోనూ వికాస్కు మంచి ప్రావీణ్యం ఉంది. కెరీర్పరంగా ఎక్కువగా డిస్కస్ త్రోపైనే దృష్టిపెట్టిన ఈ కర్ణాటక ప్లేయర్ రెండుసార్లు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించాడు. వికాస్ రెండు ఒలింపిక్స్లలో పాల్గొన్నాడు.

పరాట్టు రవీంద్రన్ శ్రీజేష్ (పీఆర్ శ్రీజేష్)
ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా అడ్డుగోడలా నిలబడే గోల్కీపర్ పరాట్టు రవీంద్రన్ శ్రీజేష్. కేరళకు చెందిన శ్రీజేశ్ భారత హాకీ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. అతని సారథ్యంలో భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

సాక్షి మాలిక్
రియో ఒలింపిక్స్లో పతకం ఆశలు ఆవిరవుతున్న వేళ అర్ధరాత్రి సాక్షి మాలిక్ భారత్కు పతక స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. చిన్న దేశాలు గొప్ప విజయాలు సాధిస్తున్న రియో గడ్డపై శతకోటి జనాభా ఉన్న రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించింది. హర్యానాకు చెందిన సాక్షి 58 కేజీల బౌట్లో తన అద్వితీయ ప్రదర్శనతో కాంస్యాన్ని సాధించింది. ఫలితంగా ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్గా కొత్త అధ్యాయాన్ని లిఖించింది.


Click it and Unblock the Notifications











