ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. అప్పటి లక్నో టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య జరిగిన వాగ్వాదం సినిమా ఫైట్ను తలపించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ఈ సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది.
అయితే ఈ సీజన్లో గంభీర్ కేకేఆర్ మెంటార్గా బాధ్యతలు అందుకున్నాడు. దీంతో గత గొడవను కోహ్లి-గంభీర్ ఈ ఏడాది కొనసాగిస్తారేమో అని కొందరు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ సాఫీగా సాగింది. గంభీర్-కోహ్లి ఆప్యాయంగా కౌగిలుంచుకుని సరదాగా ముచ్చటించుకున్నారు. కాగా, కోహ్లితో ఉన్న అనుబంధాన్ని గంభీర్ తాజాగా వివరించాడు.

టీఆర్పీ కోసం తమ ఇద్దరి మధ్య గొడవ ఉన్నట్లుగా మీడియా హైప్ చేస్తుందని గంభీర్ పేర్కొన్నాడు. ''ఇదంతా టీఆర్పీ కోసం. నేను, కోహ్లి ఎలాంటి వ్యక్తులు అనేది మీడియాకు తెలియదు. హైప్ క్రియేట్ చేయాలనే మీడియా చూస్తుంటుంది. అయితే ఈ హైప్ను పాజిటివ్గా కూడా చూపించవచ్చు. కోహ్లి చెప్పినట్లు మీ గాసిప్స్కు ముగింపు లభించింది''
''నా దృష్టిలో.. ఇద్దరి వ్యక్తులు పరిణితి చెందినప్పుడు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో, సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇక నేను కోహ్లి నుంచి నేనేమైనా నేర్చుకోవాలంటే అది డ్యాన్స్. నాకు ఒక స్టెప్ కూడా రాదు'' అని గంభీర్ అన్నాడు. కోహ్లి స్ట్రైక్రేట్ గురించి గంభీర్ స్పందిస్తూ ''ప్రతి ఆటగాడి ఆట భిన్నంగా ఉంటుంది. మాక్స్వెల్ ఆటను కోహ్లి ఆడలేదు. అదే విధంగా విరాట్ ఆటను మాక్సీ ఆడలేడు''
''జట్టులో 11 మంది భిన్నమైన ప్లేయర్లు ఉండాలి. ఆది నుంచి టాప్-8 మంది బ్యాటర్లు హిట్టర్లు ఉండాలనుకుంటే.. మీరు 300 స్కోరు సాధించవచ్చు. అలాగే 30 పరుగులకే ఆలౌట్ కావొచ్చు'' అని గంభీర్ తెలిపాడు. టీ20ల్లో కోహ్లి స్ట్రైక్రేటుకు మద్దతుగా ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.