దుబాయ్: త్వరలో జరగబోయే మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్(ఎంసిఎల్) లీగ్లో పాల్గొనే జెమిని అరేబియన్స్ జట్టుకు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్, టీమ్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. టీం లోగో, టీం జెర్సీలను ఆవిష్కరించేందుకు ఆటగాళ్లు, మేనేజ్మెంట్ వివిధ దేశాల నుంచి దుబాయ్కి చేరుకున్నారు.
టీం యజమాని, సిఈఓ నలిన్ ఖైతాన్ మాట్లాడుతూ.. 'ఈ టోర్నీని విజయవంతం చేసేందుకు అందరూ క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంసిఎల్ మరింత ఆసక్తిగా, ఉత్కంఠగా సాగేందుకు తమవంతు పాత్రను పోషిస్తాం' అని తెలిపారు.
కాగా, సెహ్వాగ్, సక్లెయిన్ ముస్తక్, రిచర్డ్ లెవి, పాల్ హరీస్, జాక్వెస్ రుడల్ఫ్, గ్రాహం ఓనియన్స్, సకిబ్ అలీలు ప్రాతినిథ్యం వహిస్తున్న జెమిని అరేబియన్స్ జట్టుకు స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అభినందనలు తెలిపారు.

టీం పాట్రన్ మేధా అహ్లువాలియా మాట్లాడుతూ.. తమ జట్టుకు సెహ్వాగ్ నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు. 'వీరేంద్ర సెహ్వాగ్ను మా జట్టుకు కెప్టెన్, డైరెక్టర్గా ప్రకటించినందుక ఎంతో సంతోషిస్తున్నాం. అతడు క్రికెట్ వన్నెతెచ్చిన ఆటగాడు. తమ జట్టు విజయవంతంగా టోర్నీలో ఆటను కొనసాగిస్తుంది' అని తెలిపారు.
'సోషల్ మీడియాలో వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్గా వ్యవహరించాలని చాలా మంది కోరారు. ఈ నేపథ్యంలోనే అభిమానుల కోరిక మేరకు ఎంతో ఆనందంగా అతడ్ని మా జట్టుకు సారథిగా నియమించాం' అహ్లువాలియా తెలిపారు.
కుమార సంగక్కర, శివనరైన్ చంద్రపాల్, బ్రాడ్ హోడ్జ్, జస్టిన్ కెంప్, ముత్తయ్య మురళీధరన్, కైల్ మిల్స్, రానా నవెద్ ఉల్ హసన్, అశీష్ బగాయి లాంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
టీ20 ఫార్మట్లో క్రికెట్ దిగ్గజాల ఆటను తిరిగి అభిమానులు, ప్రేక్షకులకు అందించే ఒక మెగా టోర్నీయే ఎంసిఎల్. సుమారు 250మంది రిటైరైన అంతర్జాతీయ ఆటగాళ్లలో చాలా మంది ఎంసిఎల్ టోర్నీలో పాల్గొంటున్నారు. ఎంసిఎల్ ఆరు ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జనవరి 28-ఫిబ్రవరి 13 వరకు దుబాయి, షార్జాలలో జరుగనుంది.