దుబాయి: దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(డిఐసిఎస్)లో జరిగిన మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్(ఎంసిఎల్) టీ20 టోర్నమెంటు తొలి మ్యాచులో వీరేంద్ర సెహ్వాగ్ నాయకత్వంలోని జెమిని అరేబియన్స్ జట్టు విజయం సాధించింది. సెహ్వాగ్ జట్టు విజయంలో జెమిని అరేబియన్స్ ఆటగాడు కుమార సంగక్కర కీలక పాత్ర పోషించాడు.
జెమిని అరేబియన్స్ ధాటిగా ఆడి 20ఓవర్లలో 234 పరుగులు చేయగా, బిబ్రా లెజెండ్స్ 8 వికెట్లకు 156 పరుగులు చేసి పరాజయం పాలైంది. కుమార సంగక్కర 43 బంతుల్లోనే 86(6ఫోర్లు, 7సిక్స్లు)పరుగులు చేయగా, ఓపెనర్ రిచర్డ్ లేవీ 43 బంతుల్లో(4ఫోర్లు, 3సిక్స్లు) 62 పరుగులు చేసి సెహ్వాగ్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు.

కాగా, మొదటి బంతికే సిక్స్ కొట్టిన సెహ్వాగ్ జట్టుకు శుభారంభాన్నందించాడు. దీంతో వీరూ అభిమానులు నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. అయితే, 21 పరుగులు చేసిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత లేవీ, సంగక్కరలు కూడా ఔటయ్యారు. అనంతరం బ్రాడ్ హోడ్జ్(ఆస్ట్రేలియా) కేవలం 19 బంతుల్లోనే 46 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
235 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లిబ్రా లెజెండ్స్ ఆటగాళ్లు విఫలమయ్యారు. కైల్ మిల్స్ ధాటికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది లిబ్రా. 27/2తో మిల్స్ ఆకట్టుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ కూడా 2 వికెట్లు తీసి లిబ్రా జట్టును కష్టాల్లో నెట్టాడు. రియాన్ టెన్ డస్కటే ఒక్కడే 37 బంతుల్లో 53 పరుగులతో రాణించాడు. మిగితా ఆటగాళ్లందరూ విఫలమవడంతో లిబ్రా ఓటమి పాలైంది.
అంతకుముందు టోర్నమెంటు ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టోర్నీ ఆరు జట్ల కెప్టెన్లు ఆడం గిల్క్రిస్ట్(సగిట్టరియాస్ స్ట్రైకర్స్), పాల్ కాలింగ్ వుడ్(క్యాప్రికార్న్ కమాండర్స్), బ్రియాన్ లారా(లియో లయన్స్), గ్రేమ్ స్మిత్(విర్గో సూపర్ కింగ్స్), జాక్వెస్ కల్లిస్(లిబ్రా లెజెండ్స్), సెహ్వాగ్(జెమిని అరేబియన్స్) పాల్గొన్నారు.