ప్రపంచ క్రికెట్లో వన్డేలకు ప్రాధాన్యం తగ్గిపోతుందని కొంత కాలంగా చాలా మంది మాజీలు, దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వన్డేల పునరుద్ధరణకు ఏం చేయాలనే ఆలోచనతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒక కొత్త తరహా విధానాన్ని ఐసీసీకి సూచించింది. దీని ప్రకారం వన్డే మ్యాచులను గణనీయంగా తగ్గించేయాలని సలహా ఇచ్చింది.
ఇటీవలి కాలంలో ఐసీసీ ఈవెంట్ల మీడియా రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంసీసీకి చెందిన వరల్డ్ క్రికెట్ కమిటీ (డబ్ల్యూసీసీ) తెలిపింది. 2028లో ఐసీసీ పురుషుల ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్పై కఠిన నిర్ణయం తీసుకోవాలని ఈ కమిటీ సూచించింది.

ద్వైపాక్షిక సిరీసులకు ప్రాధాన్యత ఇస్తూనే ఫ్రాంచైజీ క్రికెట్కు కూడా అవసరమైన స్పేస్ లభించేలా ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఉండాలని డబ్ల్యూసీసీ భావిస్తోంది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు మరింత గుర్తింపు తీసుకొచ్చేలా ఈ సైకిల్ ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్లు మినహా మిగతా సిరీసుల్లో ఆడే వన్డే మ్యాచుల అవసరం ఏంటని ఈ కమిటీ ప్రశ్నించింది. వీటి వల్ల క్రికెట్కు ఎలాంటి ఉపయోగం లేదని భావించింది.
అందుకే 2027 ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లో వన్డే మ్యాచుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని సలహా ఇచ్చింది. ఇలా మ్యాచుల సంఖ్య తగ్గడం వల్ల వన్డేల క్వాలిటీ పెరుగుతుందని, సరిగ్గా వరల్డ్ కప్కు ఏడాది ముందు మినహా మిగతా సంవత్సరాల్లో వన్డేలు ఆడించొద్దని కమిటీ సూచించింది. దీని వల్ల అంతర్జాతీయ క్రికెటింగ్ క్యాలెండర్లో అవసరమైన స్పేస్ కూడా వస్తుందని కమిటీ భావించింది.
క్రికెట్ నిబంధనలను ఏర్పాటు చేసే మేరీల్యాండ్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వేసిన ఈ కమిటీలో పలువురు ప్రముఖులు ఉన్నారు. మైక్ గాటింగ్ చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సుజీ బేట్స్, క్లేర్ కానర్, అంపైర్ కుమార ధర్మసేన, టీమిండియా లెజెండ్స్ సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి, హెదర్ నైట్, జస్టిన్ లాంగర్, ఇయాన్ మోర్గాన్, రమీజ్ రజా, కుమార సంగక్కర, గ్రేమ్ స్మిత్, రికీ స్కెరిట్ ఉన్నారు.