MCA: ముంబై క్రికెట్ అసోసియేషన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ సహా ముంబై ఆటగాళ్లందరికీ కొత్తగా ఆదేశాలను జారీ చేసింది. ఇక నుంచి ముంబై తరపున క్రికెట్ ఆడే ఆటగాళ్లందరూ ముంబై టీ20 లీగ్లో పాల్గొనడం తప్పనిసరి అని ఎంసీఏ తెలిపింది. ఐపీఎల్ ఆవిర్భావం తర్వాత ఎన్నో టీ20 లీగ్ లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ముంబై టీ20 లీగ్ కూడా అలాంటిదే. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా గత రెండు సీజన్లుగా టీ20 ముంబై లీగ్ ను నిర్వహిస్తోంది. ఈక్రమంలోనే మే 26 నుంచి జూన్ 5 వరకు మూడో ఎడిషన్ నిర్వహించేందుకు ఎంసీఏ షెడ్యూల్ ను ఖరారు చేసింది. టీ20 ముంబై లీగ్ కు సంబంధించి ఈ సీజన్ ను ప్రత్యేకంగా నిలిపిందుకు గానూ.. దేశవాళీ క్రికెట్ లో ముంబైకి ఆడుతున్న టీమిండియా స్టార్లందరినీ రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే అజింక్య రహానే, సూర్య కుమార్, శ్రేయాస్ అయ్యర్, శివం దూబే, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాకపోతే, వారు ఈ లీగ్ లో ఆడాల్సి ఉంటుందని ముంబై క్రికెట్ అసోసియేషన్ కొత్త ఆర్డర్ జారీ చేసింది. వీలైతే రోహిత్ శర్మను కూడా రంగంలోకి దింపి ఈ టీ20 ముంబై లీగ్ కు మరింత ప్రాచుర్యం కల్పించాలని యోచనలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంసీఏ కొత్త ఆదేశం
ముంబై క్రికెట్ అసోసియేషన్ అందరు ఆటగాళ్లు టీ-20 ముంబై లీగ్లో ఆడటం తప్పనిసరి చేసింది. భారత జాతీయ జట్టులో భాగమైన సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే సహా అందరు ఆటగాళ్లను కూడా ఈ లీగ్లో ఆడాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఎంసీఏ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ముంబైలోని అందరు భారత ఆటగాళ్లు టీ-20 ముంబై లీగ్లో ఆడవలసి ఉంటుందని సమాచారం అందింది. ఈ లీగ్ ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభం కానుంది. భారత జట్టు తరపున ఆడుతున్న లేదా గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడుతుంది" అని పేర్కొంది.
ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు
టీ20 ముంబై లీగ్లో ఆడే ప్రతి భారతీయ ఆటగాడికి రూ.15 లక్షలు ఇస్తామని.. ఇది వేలంలో వచ్చిన డబ్బు నుంచి వేరుగా ఉంటుందని ఎంసీఏ తెలిపింది. "టోర్నమెంట్లో పాల్గొన్నందుకు భారత ఆటగాళ్లకు అసోసియేషన్ విడిగా రూ. 15 లక్షలు ఇస్తుంది. ఇది కాకుండా, వారు వేలం నుండి విడిగా సంపాదిస్తారు. మేము బేస్ ధర, ఇతర వివరాలపై పని చేస్తున్నాము" అని ఎంసీఏ తెలిపింది. రాబోయే లీగ్లో పాల్గొనడానికి దాదాపు 2800 మంది స్థానిక ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. టీ-20 ముంబై లీగ్ వేలం మే నెలలో జరగనుంది. మే 26 నుండి టోర్నమెంట్ను ప్రారంభించాలని అసోసియేషన్ పరిశీలిస్తోంది, దీని టైటిల్ మ్యాచ్ జూన్ 5 న జరగవచ్చు.