బెంగుళూరు : మైదానంలో ఆటగాళ్లు విఫలమైన ప్రతీసారి.. వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ ను, భార్యలను ఆడిపోసుకోవడం కొంతమంది అభిమానులకు పరిపాటిగా మారిపోయింది. కోహ్లి విఫలమైన సమయంలో.. అనుష్క శర్మపై అభిమానులు ఏ స్థాయి సోషల్ మీడియా వార్ చేశారో అందరికీ తెలిసిందే.
ఇప్పుడదే పరిస్థితి మరో టీమ్ ఇండియన్ క్రికెటర్ కు ఎదురైంది. ఇటీవల విండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో.. ఇప్పుడా తప్పును బిన్నీ భార్య మయంతి పైకి నెట్టేస్తున్నారు కొంతమంది అభిమానులు. విండీస్ తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో స్టువర్ట్ 32 పరుగులివ్వడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

ఆ కామెంట్స్ ఎంత దిగజారుడుగా ఉన్నాయంటే.. ఏం చేసి అతడిని భారత జట్టులో కొనసాగేలా చేస్తున్నావని కొందరు నోరు పారేసుకుంటే.. వెంటనే విడాకులు తీసుకోవాలని మరికొంతమంది ఉచిత సలహాలిచ్చారు. ఇంకొందరైతే మరీ ఘోరంగా.. అసలు ఆత్మహత్య చేసుకోలేకపోయావా అంటూ మయంతిని ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేశారు.
అయితే సదరు కామెంట్స్ పై మయంతి హుందాగా స్పందించింది. "ఆత్మహత్య చేసుకోమని నాకు కొంతమంది సలహాలివ్వడం చూస్తుంటే.. సిగ్గనిపిస్తోంది. ఇంకొంతమంది విడాకుల గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే మీ జీవితంలో మాత్రం ఇలాంటిదేది జరగకుండా ఉండాలని, ప్రేమాభిమానాలతో మీ జీవితం ఉండాలని కోరుకుంటున్నా. మాలాంటి వారిని విమర్శించడంలో మీకు చాలా ఆనందం లభిస్తోంది. ఇక డబ్బు గురించి.. నేను 18 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నా. డబ్బు కోసమే బిన్నీని చేసుకున్నాననే వాళ్లు.. ముందు ఒక మంచి ఉద్యోగం వెతుక్కోండి" అంటూ చివర్లో చురకలంటించే ప్రయత్నం చేసింది మయంతి లంగర్.