యువ సంచలనం మయాంక్ యాదవ్పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వేగంతో పాటు లైన్ అండ్ లెంగ్త్తో కచ్చితత్వంతో బంతులు విసురుతున్న మయాంక్ను కొనియాడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు అరంగేట్రం చేయాలని అన్నాడు. మరో రెండు నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు కూడా సెలక్ట్ చేయాలన్నాడు. అయితే సెహ్వాగ్ ఓ కండిషన్ పెట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో అయిదు వికెట్లకు 181 పరుగులు చేయగా, ఛేదనలో ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుల్పకూలింది. విజయంలో 21 ఏళ్ల మయాంక్ యాదవ్ది కీలక పాత్ర. నాలుగు ఓవర్లు వేసిన మయాంక్ 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, రజత్ పటిదార్ను మయాంక్ యాదవ్ పెవిలియన్కు పంపాడు. అంతేగాక ఐపీఎల్-2024లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్గా మయాంక్ రికార్డులకెక్కాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఈ నేపథ్యంలో యువ స్పీడ్గన్ మయాంక్ గురించి మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడారు.
''టీమిండియా చీఫ్ సెలక్టర్ను నేనైతే బుమ్రా, షమి తర్వాత మయాంక్ యాదవ్ పేరును టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో చేర్చుతా. మెగా టోర్నీలో మయాంక్కు స్థానం దక్కాలి. అతడు బ్యాటర్లను బోల్తాకొట్టించగలడు. మాక్స్వెల్, గ్రీన్ను గొప్పగా ఔట్ చేశాడు. భారత్ తరఫున అత్యుత్తమ టోర్నీలో ఆడటానికి అతనికి అర్హత ఉంది. క్లాస్, స్కిల్ ఉన్నాయి'' అని మనోజ్ తివారీ అన్నాడు.
దీనికి సెహ్వాగ్ బదులిస్తూ.. ''ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బౌలర్ జట్టులో ఉండాలని కోరుకుంటాం. మాక్సీ, గ్రీన్ ఫాస్ట్ బౌలింగ్లో సమర్థవంతంగా ఆడగలరు. కానీ వారికి మయాంక్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గ్రీన్కు మయాంక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆఫ్స్టంప్ను ఎగరగొట్టాడు. మయాంక్కు వరల్డ్ కప్ జట్టులో అవకాశం ఇవ్వడానికి నేను మద్దతుఇస్తున్నాను. కానీ అతడు అప్పటికీ ఫిట్గా ఉండాలి'' అని సెహ్వాగ్ అన్నాడు. మయాంక్ గాయంతో గత ఐపీఎల్ సీజన్కు దూరమైన విషయం తెలిసిందే. వాస్తవానికి గతేడాదిలోనే అతడు లీగ్లో అరంగేట్రం చేయాలి. కానీ దురదృష్టవశాత్తు దూరమయ్యాడు.