ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్లే ముందు టీమిండియా ప్లేయర్లు అందరికీ ఫిట్నెస్ టెస్టులో నిర్వహించారు. ఈ సందర్భంగా టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన యో-యో టెస్టు స్కోరును సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ టెస్టులో 17.2 పాయింట్ల స్కోరు నమోదు చేసినట్లు కోహ్లీ బయటపెట్టాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో టాప్ ప్లేస్ మాత్రం శుభ్మన్ గిల్కు దక్కిందని వార్తలు వచ్చాయి.
ట్రైనింగ్ క్యాంపులో నిర్వహించిన యో-యో టెస్టులో శుభ్మన్ గిల్ ఏకంగా 18.7 పాయింట్లు సాధించినట్లు తెలిసింది. ఇది కోహ్లీ కన్నా ఎక్కువ కావడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అదే సమయంలో వీళ్లిద్దరి మధ్య పదేళ్ల వయసు గ్యాప్ ఉన్న విషయం మర్చిపోకూడదని, ఈ వయసులో కోహ్లీ అంత స్కోరు సాధించడం మాటలు కాదని అంతా అనుకున్నారు.
అయితే ఇప్పుడు మరో ప్లేయర్ యో-యో టెస్టు స్కోరు వెల్లడించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. అసలు వీడు మనిషేనా? లేక మెషీనా? అని అడుగుతున్నారు. అతనెవరో కాదు స్టార్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కని మయాంక్.. ఇటీవల మహారాజా ట్రోఫీలో మెరిశాడు. వచ్చే దేశవాళీ సీజన్లో రాణించి, మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాడీ ఓపెనింగ్ బ్యాటర్.
ఈ క్రమంలోనే యో-యో టెస్టు తీసుకున్నాడు. ఈ టెస్టులో తనకు అత్యధికంగా 21.1 పాయింట్ల స్కోరు వచ్చినట్లు సోషల్ మీడియాలో మయాంక్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నాడు. గత కొంతకాలంగా టీమిండియా ప్లేయర్లు అందరూ కూడా ఫిట్నెస్పై బాగా ఫోకస్ పెడుతున్నారు. కోహ్లీ హయాంలోనే ఫిట్నెస్, యో-యో టెస్టులకు పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. మరి ఇంకెవరైనా వచ్చి మయాంక్ రికార్డును బద్దలు కొడతారేమో చూడాలి.
