
సెంచూరియన్: బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆడిన ఆట పట్ల టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ తాము అనుకున్న ప్రణాళికలను అనుకున్నట్టుగా అమలు చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశామని చెప్పాడు. ఆఫ్ స్టంప్కు అవతలగా వచ్చే బంతులను వదిలేయాలని ముందుగానే అనుకున్నామని అలాగే చేశామని తెలిపాడు. మొదట్లో పిచ్పై తేమ ఉండడం వల్ల బంతులు బంతికి దూరంగా వచ్చాయని మయాంక్ చెప్పాడు. కొంత సమయం గడిచిన తర్వాత బంతులు బ్యాట్ మీదకు రావడంతో తొలి రోజు మంచి స్కోర్ చేయగలిగామని వివరించాడు.
విదేశాల్లో ఆడేటప్పుడు సరైన ప్రణాళిక అవసరమని, తాము ఆ ప్రణాళికలో విజయం సాధించినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఓపెనర్ లోకేష్ రాహుల్పై ప్రశంసలు కురిపించాడు. క్రీజులో ఎలా పాతుకుపోవాలో ఇతర బ్యాటర్లు రాహుల్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. తన ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో అతడు బాగా అర్ధం చేసుకోని, బంతులను సరిగ్గా బాదాడని చెప్పుకొచ్చాడు. తన ప్రణాళిక తాను అనుకున్న ప్రకారం క్రమశిక్షణగా అమలు చేసి ఫలితం రాబట్టాడని కొనియాడాడు. మొదటి రోజు భారీ స్కోర్ సాధించడంలో రాహుల్ నెలకొల్పిన భాగస్వామ్యాలు సహకరించాయని తెలిపాడు.
తనతోపాటు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేతో రాహుల్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడని మయాంక్ అన్నాడు. ఇక రెండో రోజు తొలి గంట చాలా కీలకం అన్న మయాంక్.. వీలైననన్నీ ఎక్కువ పరుగులు చేసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కాగా మయాంక్ అగర్వాల్తో కలిసి తొలి వికెట్కు 117 పరుగులు జోడించిన లోకేష్ రాహుల్.. మూడో వికెట్కు 82 పరుగులు జోడించాడు. ఇక నాల్గో వికెట్కు అజేయంగా 73 పరుగులు జోడించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, లోకేష్ రాహుల్ ఓ రికార్డును అందుకున్నాడు. సౌతాఫ్రికాలో 11 ఏళ్ల తర్వాత భారత్ తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం అందించిన ఓపెనింగ్ జోడిగా నిలిచారు. అంతేకాకుండా సౌతాఫ్రికాలో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన మూడో భారత ఓపెనింగ్ జోడిగా నిలిచారు. వీరి కంటే ముందు 2006లో వసీమ్ జాఫర్-దినేశ్కార్తీక్ జోడీ 153 పరుగులు, 2010లో సెహ్వాగ్-గంభీర్ జోడి 137 పరుగులు చేశారు.
కాగా ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్లో మయాంక్, రాహుల్ తొలి వికెట్కు 117 పరుగులు జోడించారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో టీమిండియా ఓపెనర్లు టెస్టు ఫార్మాట్లో వికెట్ పడకుండా 20కు పైగా ఓవర్లు ఆడటం ఇది ఏడోసారి. అయితే 2011- 2020 మధ్య పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా టీమిండియా ఓపెనర్లు 20 ఓవర్లు ఆడలేదు.