
కరోనా కలకలం
బుధవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో టీమిండియాలో కరోనా కలకలం రేగింది. ఏకంగా జట్టులోని ఏడుగురు సభ్యులు వైరస్ బారిన పడ్డారు. వైరస్ బారిన పడిన వారిలో ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టాండ్బై ఆటగాడు నవదీప్ సైనీ ఉన్నారు. ఇక మిగతా వారిలో జట్టు సహాయక సిబ్బంది ఉన్నారు.
సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ బి. లోకేష్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్కు మొదటి రౌండ్ ఫలితాలలో నెగెటివ్గా వచ్చింది. అయితే మూడో రౌండ్ ఫలితంలో మాత్రం పాజిటివ్గా తేలింది.

జట్టులోకి మయాంక్
టీమిండియాలోని ముగ్గురు కీలక ఆటగాళ్లు కరోనా బారినపడడంతో మయాంక్ అగర్వాల్ను జట్టులో చేర్చారు. మయాంక్ అగర్వాల్ చివరగా వన్డేల్లో 2020లో భారత జట్టు తరఫున ఆడాడు. అప్పుడు ఆస్ట్రేలియాతో బరిలోకి దిగాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ సభ్యుడిగా ఉన్నాడు.
కెరీర్లో ఇప్పటివరకు 5 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడిన మయాంక్ అగర్వాల్ 17 సగటుతో 86 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 32 పరుగులు. ఇక టెస్టుల్లో 19 మ్యాచ్లు ఆడి 43 సగటుతో 1429 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు సార్లు డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 243 పరుగులు.

6 నుంచి వన్డే సిరీస్
కాగా షెడ్యూల్ ప్రకారం భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ వన్డే సిరీస్ 6, 9, 11వ తేదీల్లో జరగనుంది. 16 నుంచి కోల్కతా వేదికగా టీ20 సిరీస్ జరగనుంది. 16, 18, 20వ తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది.
మొదట ఈ మ్యాచ్లను అహ్మదాబాద్, జైపూర్, కోల్కతా, కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలో వేదికలలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో అహ్మదాబాద్, కోల్కతా అనే రెండు వేదికలలో వన్డే, టీ20 సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే తాజాగా టీమిండియాలో భారీగా కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ షెడ్యల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది.

భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్.


Click it and Unblock the Notifications












