
సగం మంది మాత్రమే
ఐపీఎల్ 2021 రెండో దశ సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు ద్వైపాక్షిక సిరీసులు ఉన్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాలతో వాటికి అందుబాటులో ఉండలేమని కొందరు ఆటగాళ్లు ఇప్పటికే చెప్పేశారు. దాదాపు 20 మంది ఐపీఎల్ ఆటగాళ్లలో.. సగం మంది మాత్రమే బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నారు. గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్-నైల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2021 పార్ట్ -2లో ఆడనున్నారు. వీరితో పాటు జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, డేనియెల్ సామ్స్ కూడా ఐపీఎల్కు వస్తారని తెలిసింది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా తమ ప్రకటనలో తెలిపింది.

బెంగళూరు, ముంబై జట్లకు పండగే
ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న గ్లెన్ మాక్స్వెల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడి దారుణంగా విఫలమైన మాక్స్వెల్.. ఈసారి మాత్రం ఒంటిచేత్తో మ్యాచులను గెలిపించాడు. మ్యాక్సీ రాకతో ఆర్సీబీ అభిమానులు పండగచేసుకోనున్నారు. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ మాంచి ఊపు మీద ఉంది.
ఎన్నడూలేని విధంగా వరుసగా నాలుగు విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. మాక్స్వెల్ మాత్రమే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కూడా జట్టుకు విజయాలు అందించారు. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్.. క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్-నైల్ రాకతో ముంబై ఇండియన్స్ కూడా పండగ చేసుకోనున్నాయి.

ఆలోచనలో పడిన సీఏ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ యూఏఈలో జరుగుతుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) సైతం ఆలోచనలో పడిందని సమాచారం. ఐపీఎల్ 2021లో ఆడే ఆటగాళ్లను అడ్డుకోకుండా ఉండటమే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ అనుభవం మెగా టోర్నీకి ఉపయోగపడుతుందని సీఏ భావిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021 ఆడేందుకు వస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు.
ఐపీఎల్ కోసం కరీబియన్ లీగ్ను సైతం వెస్టిండీస్ బోర్డు ముందుకు జరిపింది. మరోవైపు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును బీసీసీఐ ఒప్పించే పనిలో పడిందని సమాచారం. అన్నీ కుదిరితే ఆంగ్లేయులూ క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నారు.

బంతి స్టాండ్లోకి వెళితే
ఐపీఎల్ పార్ట్-వన్ సమయంలో బయో బబుల్లో క్రికెటర్లు ఉండాల్సి వచ్చింది. అయితే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ ఆలోచన చేస్తున్నది. మిగిలిపోయిన మ్యాచ్లను సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడానికి బోర్డు తన వంతు ప్రయత్నం చేస్తున్నది.
ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్ట్-టూ ఐపీఎల్ కోసం బీసీసీఐ పలు షాకింగ్ రూల్స్ తీసుకొచ్చింది. యూఏఈలో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీఐ 46 పేజీల ఆరోగ్య సలహాలు తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడె బంతిని స్టాండ్లోకి సిక్స్గా బాదితే.. ఆ బంతిని ఉపయోగించరు. కొత్త బంతితో ఆడతారు. మైదానం బయటపడే బంతులను ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున.. తిరిగి అదే బంతిని వాడితే వైరస్ సోకే ప్రమాదం ఉంది.

రిలయన్స్ భారీ ప్రణాళిక
ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకొనేందుకు రిలయన్స్ భారీ ప్రణాళికతో రానుందని తెలిసింది. ఈ మేరకు కార్యచరణ సిద్ధమైందని సమాచారం. నెట్వర్క్ 18, రిలయన్స్ జియో సంయుక్తంగా ఐపీఎల్ను ప్రసారం చేసేందుకు సర్వం సిద్ధమైందట. ప్రస్తుతం ఐపీఎల్ ప్రసార హక్కులు డిస్నీ స్టార్ ఇండియా వద్ద ఉన్నాయి.
2022తో ఒప్పందం ముగుస్తుంది. బిడ్డింగ్స్ ద్వారా కొత్త ప్రక్రియ ఈ ఏడాది ఆఖర్లో ఆరంభమవుతుంది. డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్, అమెజాన్ ఇండియా సైతం హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి. రిలయన్స్ నుంచి సరికొత్త క్రీడా ఛానల్ రాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఫుట్బాల్ లీగ్ 'లా లిగా' ప్రసార హక్కుల్లో వయాకామ్కు మెజారిటీ వాటా ఉంది. ఎంటీవీ, వూట్లో లీగ్ ప్రసారం అవుతోంది.

రూ.16,347 కోట్లకు
ఐపీఎల్ 2018-2022 సైకిల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా రూ.16,347 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు 24 కంపెనీలు హక్కుల కోసం పత్రాలు తీసుకున్నాయి. ఫేస్బుక్, అమెజాన్, ట్విటర్, యాహూ, రిలయన్స్ జియో, సోనీ పిక్చర్స్, డిస్కవరీ, స్కై, బ్రిటిష్ టెలికామ్, ఈఎస్పీఎన్ డిజిటల్ మీడియా బిడ్ పత్రాలు తీసుకొన్నాయి. కేవలం డిజిటల్ హక్కుల కోసమే రిలయన్స్ జియో రూ.3075 కోట్లకు బిడ్ వేయడం గమనార్హం. అయితే అప్పుడు మొత్తంగా స్టార్కే హక్కులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications












