సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారిపై భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోందని, త్వరలోనే మహమ్మారిని తరిమికొట్టి పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. స్థానిక పరిస్థితుల గురించి తెలియకుండా ఆ దేశం గురించి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదంన్నాడు. భారత దేశంలో ఉన్న సోదరసోదరీమణులు బాగుండాలి హెడెన్ కోరుకున్నాడు. భారత్ అంటే హెడెన్కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు అతడు ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు.
మాథ్యూ హెడెన్ కరోనా సంక్షోభం గురించి సీఎన్ఎన్ న్యూస్ 18తో మాట్లాడుతూ... 'వ్యక్తిగతంగా నాకెన్నో పాఠాలు నేర్పిన దేశం పట్ల నాకెంతో ప్రేమ, సానుభూతి ఉన్నాయి. ఇండియాతో పాటు అక్కడి మనుషులతో నాకు ఏదో తెలియని బంధం ఉంది. అక్కడ భిన్న సంస్కృతుల సమ్మేళనం. భారత దేశంలో చాలామంది సోదరసోదరీమణులు ఉన్నారు. ఆస్ట్రేలియాలో 700000 కుటుంబాలు ఉన్నాయి. మేము భారతదేశానికి 15 టన్నుల వైద్య సామాగ్రి, 3000 వెంటిలేటర్లు మరియు వంద ఆక్సిజన్ వెంటిలేటర్లను పంపాము' అని అన్నాడు.
అక్తర్ ఎప్పుడూ అలాంటి కలలే కంటూ ఉంటాడు.. అతడు వాస్తవంలో బతకాలి! ఆసిఫ్ చురకలు!
'ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే.. అత్యధిక జనాభా ఉన్న భారత్ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు చాలా దయగలిగిన వారు. ఇతరుల పట్ల ప్రేమానురాగాలు చూపిస్తారు. త్వరలోనే వారు మళ్లీ మునుపటి జీవితాన్ని గడుపుతారు. మూడు దశాబ్దాలుగా ఓ యాత్రికుడిగా, ఓ సోదరుడిగా వారి ఆప్యాయతను పొందుతున్నాను. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. అలాంటి అందమైన దేశం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది సరికాదు. కరోనాపై పోరులో భారత్ బాగానే పనిచేస్తోంది. కఠిన సమయాల్లో వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది' అని హెడెన్ పేర్కొన్నాడు.
దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. గురువారం మృతుల సంఖ్య మరోసారి నాలుగువేలకు పైగా నమోదైంది. అలాగే 2.59లక్షల మంది వైరస్ బారిన పడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం 20,61,683 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,59,551 మందికి పాజిటివ్గా తేలింది.
ముందురోజుతో పోల్చుకుంటే కొత్తకేసులు స్వల్పంగా తగ్గాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకోట్ల 60లక్షల మార్కును దాటింది. 24గంటల వ్యవధిలో 4,209 మంది ప్రాణాలు వదిలారు. క్రితంరోజు ఆ సంఖ్య 3,874గా ఉంది. అయితే వరసగా మూడురోజులుగా 20లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొత్త కేసులు మూడులక్షలకు దిగువనే నమోదు అవుతున్నాయి.