
సిడ్నీ: గత పర్యటనలో టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా తమను దెబ్బతీశాడని ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. పుజారా బ్యాటింగ్ చూసేటప్పుడు మాత్రం మాకు మరింత కాఫీ అవసరమవుతుందని చమత్కరించాడు. 2018-19 పర్యటనలో 2-1తో సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీలు బాది 521 పరుగులు సాధించాడు. డిసెంబర్ 17 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియన్లు కాఫీ ఇష్టపడతారని అందరికీ తెలుసు. ఛెతేశ్వర్ పుజారా బ్యాటింగ్ చూసేటప్పుడు మాత్రం మాకు మరింత కాఫీ అవసరమవుతుంది. కిందటి పర్యటనలో మమ్మల్ని అతడు దెబ్బతీశాడు. ఈ తరంలో అందరూ ధాటిగా ఆడే బ్యాట్స్మెన్ను ఇష్టపడుతున్నారు. టెస్టుల్లో 45 కన్నా తక్కువ స్ట్రైక్రేట్ ఉన్న అతి కొద్ది మంది ఈ తరం బ్యాట్స్మెన్లో పుజారా ఒకడు. కానీ మమ్మల్ని అతడు దెబ్బతీయగలడు' అని పేర్కొన్నాడు.
గత పర్యటనలో 521 పరుగులు చేసిన పుజారాకు ఇప్పుడు మాత్రం తమ బౌలర్లు ఆ చాన్స్ ఇవ్వరని ఇటీవలే ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు. 'కరోనా వైరస్ కారణంగా చతేశ్వర్ పుజారా ఈ మధ్య కాలంలో క్రికెట్ ఆడలేదు. ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఇది పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. పుజారా ఏ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతను చివరి సిరీస్ కంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈసారి పుజారాకు అతి పెద్ద చాలెంజ్ తప్పదు. గతంలో మాదిరిగా ఈసారి పుజారాకు మా బౌలర్లు చాన్స్ ఇవ్వరు' అని మెక్గ్రాత్ పేర్కొన్నాడు.
భారత క్రికెట్ జట్టులో టెస్టు ఆటగాడిగా ఛెతేశ్వర్ పుజారాపై ముద్ర పడింది. నిజం చెప్పాలంటే అదే అతని కెరీర్కు తీవ్ర నష్టం చేసింది. సుదీర్ఘ ఫార్మాట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉండే పుజారా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అది కూడా ఐదు వన్డేలు. పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్కు సరిపోడనే అపవాదుతో అతన్ని కనీసం ఐపీఎల్లో కూడా ఏ ప్రాంచైజీ పరిశీలించడం లేదు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజారా 48.86 సగటుతో 5840 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు (3 డబుల్ సెంచరీలు), 25 అర్థ సెంచరీలున్నాయి. ఇక 5 వన్డేలు ఆడి 51 రన్స్ చేసాడు.