హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం కెప్టెన్ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు ఆసీస్ ఆటగాళ్లతో స్లెడ్జింగ్కు పాల్పడ్డారు. ఆదివారం బ్యాటింగ్లో ఎంతో పరిణిత కనబరిచిన రెన్ షా, తనతో స్లెడ్జింగ్కు పాల్పడిన కోహ్లీ విషయంలోనూ పరిపక్వత ప్రదర్శించాడు.
భారత బౌలర్లకు సవాల్ విసురుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లను కోహ్లీ కవ్వించే ప్రయత్నం చేశాడు. తొలుత స్మిత్తో మాటల యుద్ధానికి దిగిన కోహ్లీ ఆ తర్వాత పూణె 'టాయిలెట్ బ్రేక్'ను గుర్తు చేస్తూ రెన్ షాను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో రెన్ షా 196 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
రెండో రోజు ఆట ముగిసిన అనంతరం స్టేడియంలో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని అడిగిన ప్రశ్నకు గాను 'నేను దాన్ని సరదాగా తీసుకున్నా. పరిగెత్తుకుంటూ టాయ్లెట్కు వెళ్లిన విషయాన్ని కోహ్లీ గుర్తు చేయాలనుకున్నాడు. నేను మాత్రం నవ్వి ఊరుకున్నాను' అని రెన్ షా చెప్పాడు.
ఇక ఇద్దరు కెప్టెన్ల మధ్య జరిగిన దాని గురించి చెబుతూ 'మాటలు తూటాలు పేలాయి. ఒకరినొకరు రెచ్చగొట్టుకుని మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేశారు' అని రెన్ షా అన్నాడు. అయితే స్లెడ్జింగ్ను తనదైన తరహాలో ఎదుర్కొంటానని రెన్ షా చెప్పడం విశేషం.
'పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మాటల కంటే.. చిన్ననవ్వు ప్రత్యర్థి బౌలర్లను మరింతగా కవ్విస్తుందని గత అనుభవాల ద్వారా నేర్చుకున్నా. అలాగే ప్రవర్తించాను' అని రెన్ షా చెప్పాడు.