ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సూపర్ హిట్టింగ్తో ఒక్క బంతి మిగిలుండగానే ముంబై విజయతీరాలకు చేరింది.
అంతేగాక ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసినగుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ(35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 66), దయాలన్ హేమలత(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 74) హాఫ్ సెంచరీలతో రాణించింది. భార్టి ఫుల్మాలి(13 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించింది.

అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 95 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. అయితే ఓ దశలో హర్మన్ప్రీత్ 21 బంతుల్లో 20 పరుగులే చేసింది. అనంతరం బ్యాటును ఛేంజ్ చేసిన తర్వాత విజృంభించింది. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించింది. దీంతో మ్యాచ్ అనంతరం బ్యాటును మ్యాచ్ రిఫరీ చెక్ చేశారు.
అయితే బ్యాటు మార్చుకోవడానికి గల కారణాలను హర్మన్ప్రీత్ వివరించింది. '' ప్రాక్టీస్లో ఉపయోగించే బ్యాటుతో మ్యాచ్ ఆడాను. సాధారణంగా మ్యాచ్లో నేను ఆడే బ్యాటు ఇది కాదు. అయితే బ్యాటు గ్రిప్ కాస్త జారుతున్నట్లుగా అనిపించడంతో బ్యాటును మార్చుకున్నాను. ప్రాక్టీస్ చేసే బ్యాటుతో ఆడాలని నిర్ణయించుకున్నాను. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ నా బ్యాట్ను చెక్ చేశారు. నా బ్యాటులో ఏమైనా ఉందేమో అని పరిశీలించారు'' అని హర్మన్ప్రీత్ పేర్కొంది. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హర్మన్ప్రీత్కు దక్కింది.