ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్తో వచ్చే నష్టాలను, ప్రమాదాలను ఆటగాళ్లు ముందే తెలుసుకోవాలని భారత బ్యాటింగ్ లెజెండ్ సునిల్ గవాస్కర్ సూచించారు. తాజాగా తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టిఎన్పిఎల్), కర్ణాటక ప్రిమియర్ లీగ్లలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు బయటపడిన నేపథ్యంలో గవాస్కర్ పైవిధంగా స్పందించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చట్టాన్ని సవరించి బెట్టింగ్ను న్యాయబద్ధం చేస్తే.. భారత క్రికెట్లో అవినీతిని అరికట్టొచ్చు అని ఇప్పటికే బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం (ఏసీయూ) హెడ్ అజిత్ సింగ్ షెకావత్ పేర్కొన్నాడు.
త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న బౌలర్.. బంతి తలకు తగిలుంటే!!
శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో గవాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ... 'సమాజంలో చాలా మంది నేరస్థులు ఉన్నారు. దురాశతో క్రికెట్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నారు. మరికొందరు ఇతరుల ఒత్తిడితో చేస్తున్నారు. బుకీలు అవినీతిలోకి లాగడానికి ఏ విధంగా ప్రేరేపిస్తారో ఆటగాళ్లకి ముందే తెలియజేయాలి. దీంతో ఫిక్సింగ్ వలలో పడకుండా ఉండే అవకాశం ఉంది. పేదరికం నుంచి వచ్చిన ఆటగాళ్లకు ఒకేసారి అధిక మొత్తంలో డబ్బుని చూడటంతో బుకీల నియంత్రణలోకి వెళ్తున్నారు' అని అన్నారు.
'తమిళనాడు, కర్ణాటకు లీగ్లు భారత క్రికెట్కు ఎంతో మేలు చేస్తాయి. కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభ చూపించడానికి సరైన వేదిక. కానీ.. ఫిక్సింగ్తో ఎంతో మంది ఆటగాళ్లు తమ జీవితాలను కోల్పోతున్నారు. అవినీతికి దూరంగా ఉండాలని ఆటగాళ్లు భావిస్తారు. కానీ.. అది అంత తేలికైన విషయం కాదు. ఎంతోమంది యువ ఆటగాళ్లను లక్ష్యం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తప్పు చేస్తే సులువుగా దొరికిపోతారు' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇంతకుముందు షెకావత్ మీడియాతోమాట్లాడుతూ... 'స్పాట్ ఫిక్సింగ్ను ఏం చేసినా మనం అరికట్టలేం. దీనికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చట్టం అవసరం. ఫిక్సింగ్పై స్పష్టమైన చట్టం ఉంటే పోలీసులు ఇంకా మెరుగ్గా పనిచేస్తారు. బెట్టింగ్ను చట్టబద్ధం చేయడం వల్ల అవినీతిని నియంత్రించవచ్చు. నిబంధనలు పక్కాగా రూపొందించినప్పుడు నియంత్రణ సాధ్యం అవుతుంది. ఇది ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయాన్ని తెస్తుంది. ఎక్సైజ్ విభాగం ఆదాయానికి దగ్గరగా ఉంటుంది. క్రీడలపై పెడుతున్న బెట్టింగ్ డబ్బు మనసును కదిలించేలా ఉంటుంది' అని అజిత్ సింగ్ పేర్కొన్నారు.