బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) అవినీతి నిరోధక విభాగం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన బంగ్లాదేశ్ బ్యాటర్ మిన్హాజుల్ అబెడిన్ సబ్బీర్పై ఐదేళ్ల నిషేధం విధించాలని సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ దేశవాళీ లీగ్లో జరిగిన ఒక మ్యాచ్లో సబ్బీర్ అనుమానాస్పదంగా ఔటైన అయిన తర్వాత వెలువడింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢాకా ప్రీమియర్ లీగ్(DPL)లో షైన్పుకూర్ క్రికెట్ క్లబ్, గుల్షన్ క్రికెట్ క్లబ్ల మధ్య జరిగిన మ్యాచ్లో సబ్బీర్ అనుమానాస్పదంగా ఔట్ అయ్యాడు. ఈ విషయంపై అవినీతి నిరోధక విభాగం( ACU) విచారణ చేపట్టింది. విచారణలో ఆ మ్యాచ్లో రెండు వింత అవుట్లు జరిగాయని గుర్తించారు.

అసలేం జరిగింది?
మ్యాచ్లోని 36వ ఓవర్లో ఓపెనింగ్ బ్యాటర్ రహీమ్ అహ్మద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిహాదుజ్జుమాన్ బౌలింగ్లో క్రీజు నుంచి ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత 44వ ఓవర్లో సబ్బీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. అనూహ్యంగా క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. గుల్షన్ వికెట్ కీపర్ మహిదుల్ ఇస్లాం అంకోన్ వెంటనే సబ్బీర్ను స్టంపౌట్ చేశాడు. ఎలాంటి అప్పీల్ లేకుండానే అతను ఔట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
క్రిక్బజ్ నివేదిక ప్రకారం, సబ్బీర్ అనుమానాస్పద బెట్టింగ్ ఏజెంట్లతో నిరంతరంగా సంబంధాలు కొనసాగించినట్లు అవినీతి నిరోధక విభాగం( ACU) గుర్తించింది. ఈ విషయంలో సబ్బీర్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైంది. అతనిపై తదుపరి చర్యల కోసం ఈ కేసును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక ట్రిబ్యునల్కు పంపించారు. ఈ కేసు విచారణలో లభించిన ఆధారాల ప్రకారం, సబ్బీర్పై కనీసం ఐదేళ్ల నిషేధం విధించాలని అవినీతి నిరోధక విభాగం(ACU) సిఫార్సు చేసింది. ఇది సబ్బీర్ నేరం తీవ్రతను బట్టి 8 నుంచి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని కూడా పేర్కొంది. గతంలో మహమ్మద్ అష్రాఫుల్ కేసులో ఇచ్చిన ఎనిమిదేళ్ల నిషేధం వంటి కఠిన శిక్షలు ఈ కేసులో కూడా అమలు కావాలని ACU భావిస్తోంది.
అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాల ప్రమేయం?
సబ్బీర్ ఒక విదేశీ ఫోన్ నంబర్తో నిరంతరంగా మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఈ నంబర్ అంతర్జాతీయ బెట్టింగ్ ఏజెంట్లకు చెందినదని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ ముఠాలు కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఇంటర్పోల్ సహకారంతో ICC-ACU విచారించాలని సూచించారు. ఈ ఘటన బంగ్లాదేశ్ క్రికెట్ లో అవినీతిని అరికట్టడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక హెచ్చరికలా నిలిచింది.