మెల్బోర్న్: ఈ సీజన్లో తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి 18 నుంచి ఆరంభం కానున్న తరుణంలో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. గత దశాబ్ధకాలంగా ప్రపంచ టాప్-50 టెన్నిస్ క్రీడాకారుల్లో 16 మందికి ఫిక్సింగ్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మేరకు ఫిక్సింగ్కు సంబంధించిన రహస్య ఫైళ్లు తమ దగ్గర ఉన్నాయని బీబీసీ, బజ్ ఫీడ్ న్యూస్ వెల్లడించాయి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో గ్రాండ్ స్లామ్ విజేతలు కూడా ఉన్నారు. ప్రపంచ టెన్నిస్లో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందని బీబీసీ, బజ్ ఫీడ్ పేర్కొంది.
2007లో ఏటీపీ ఏర్పాటు చేసిన విచారణ బృందం నివేదికలోని వివరాలు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించాయి. 2007లో జరిగిన ఓ మ్యాచ్లో 87వ ర్యాంకులో ఉన్న మార్టిన్ వసుల్లో ఆరుగ్యుల్లో చేతిలో నాల్గవ ర్యాంకులో ఉన్న నికోలో డావేడెంకో ఓటిమి పాలైన మ్యాచ్ తాలూకా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నాయి.

రష్యా, ఇటలీలలో బెట్టింగ్ ముఠాలున్నాయని, కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగిందని, కొన్ని మ్యాచ్లను ఫిక్సింగ్ చేసినట్టుగా భావిస్తున్నట్టు ఆ నివేదికలో వెల్లడించింది. అంతేకాదు 2008లో 28 క్రీడాకారుల ప్రమేయంపై విచారణ జరిగినట్టు బీబీసీ పేర్కొంది.
టెన్నిస్లో 2009లో కొత్త అవినీతి వ్యతిరేక విభాగాన్ని ప్రవేశపెట్టాక, అంతకుముందు సుమారు 16 మంది ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. అంతేకాదు గ్యాంబ్లర్లు మేజర్ టోర్నమెంట్లలో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునేవాళ్లని బజ్ ఫీడ్ వెల్లడించింది.
ఆటగాళ్లు బస చేసిన హోటళ్లలో సంప్రదించేవారని, ఫిక్సింగ్ చేయడానికి లక్షలాది రూపాయలను ఆఫర్ చేసేవారని పేర్కొంది. కాగా టెన్నిస్ అవినీతిని అరికట్టడంలో ఎలాంటి అలసత్వం చూపలేదని టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ (టీఐయు) అధికారులు చెబుతున్నారు. 2008లో అవనీతి వ్యతిరేక విభాగాన్ని ప్రవేశపెట్టాక అవినీతి విషయంలో చాలా కఠినంగా ఉన్నట్లు ఏటీపీ చీఫ్ క్రిస్ కెర్మొడె చెప్పారు.