కోల్కతా: శనివారం నాడు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ పైన కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలుత పుణే ఆరు వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో 103 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా కోల్కతా లక్ష్యాన్ని 9 ఓవర్లలో 66 పరుగులుగా నిర్ణయించారు. దీనిని కోల్కతా చేధించింది.
పుణే పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచింది. పుణే జట్టు 12 మ్యాచులు ఆడి, 3 మ్యాచులు గెలిచింది. 9 మ్యాచులు ఓడిపోయింది. దీంతో, పుణే ఇప్పటికే ఇంటికి దారి పట్టినట్లే. కోల్కతా ఈ గెలుపుతో రెండో స్థానంలోకి వెళ్లింది. ధోనీ నేతృత్వంలో ఉన్న పుణే అట్టడుగు స్థానంలో నిలిచి, ఇంటి దారి పడుతుండటం గమనార్హం.
శనివారం నాడు మ్యాచ్ సమయంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్కు వచ్చిన సమయంలో గౌతమ్ గంభీర్ ఫీల్డర్స్ను దగ్గరగా పెట్టాడు. ఇక్కడ గంభీర్.. ధోనీ పైన తన తెలివిని ఉపయోగించాడు. ధోనీ కొట్టకుండా, అతని పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశాడు. అది సఫలమైంది.

పుణే నాలుగు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసిన సమయంలో ధోనీ బ్యాటింగుకు వచ్చాడు. ధోనీ దూకుడుగా ఆడతాడు. అయితే, అతని పైన గంభీర్ మాస్టర్ స్ట్రాటజీ ఉపయోగించాడు. గంభీర్.. తను, మరో ముగ్గురు ఫీల్డర్లను ధోనీని ఇబ్బంది పెట్టేలా ఉంచాడు.
దీంతో, ధోనీ బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఈ కారణంగానే ట్వంటీ 20 క్రికెట్లోనే ధోనీ అత్యంత చెత్త ఆట ఆడాడు. ధోనీ 22 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ట్వంటీ 20ల్లో ధోనీకి అత్యంత స్లోయెస్ట్ బ్యాటింగ్ ఫర్మార్మెన్స్ ఇది. గంభీర్ తెలివిని కొందరు మెచ్చుకుంటే, ధోనీ అభిమానులు మాత్రం దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.