
హైదరాబాద్: శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తోన్న '800' సినిమాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా కనిపించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సచిన్, మురళీధరన్లకు పిచ్తో గొప్ప అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నోసార్లు ప్రత్యర్ధులుగా తలపడ్డారు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
అయితే, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్లో సచిన్ టెండూల్కర్ నటిస్తున్నారనే విషయాన్ని డార్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హెడ్ సేతుమాధవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సేతుమాధవన్ మాట్లాడుతూ "సచిన్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్, మురళీ వరల్డ్ బెస్ట్ బౌలర్.. వీరిద్దరి క్రికెట్ కెరీర్ సమానంగా సాగింది. దీంతో సచిన్ కూడా ఈ ఫిల్మ్లో కనిపిస్తారు" అని తెలిపాడు.
"డిసెంబర్, 2019 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదొక పెద్ద బడ్జెట్ సినిమా, ఈ సినిమా మొత్తాన్ని భారత్లోనే చిత్రీకరించారు. శ్రీలంక, ఇంగ్లాండ్లలో సైతం కొంత సినిమాను తీస్తాం" అని అన్నాడు. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ బయోపిక్కు శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్నారు.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ "మురళీధరన్ పాత్రలో నటించడం కెరీర్లోనే ఓ గొప్ప విషయం. చాలా గౌరవంగా భావిస్తున్నా. వాస్తవానికి ఆయన పాత్ర పోషించడం సవాలుతో కూడుకున్న విషయం" అని అన్నాడు. 1972లో కాండీలో జన్మించిన ముత్తయ్య మురళీ ధరన్ 1992 నుంచి 2011 మధ్య కాలంలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
తన బౌలింగ్ యాక్షన్తో క్రికెట్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించాడు. 1996లో శ్రీలంక జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలవడంలో ముత్తయ్యదే కీలకపాత్ర. 133 టెస్టులాడి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మురళీధరన్(800) అగ్రస్థానంలో ఉన్నాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. మూడు ఫార్మాట్లు కలిపి ముత్తయ్య 1,247 వికెట్లు పడగొట్టాడు.