U19 Asia Cup 2025: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు ఏకపక్షంగా ముగిసింది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసి ఆసియా కప్ విజేతగా నిలిచింది. పాకిస్థాన్కు ఇది రెండో అండర్-19 ఆసియా కప్ టైటిల్. గతంలో 2012లో భారత్తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన పాక్.. ఈ సారి ఏకఛత్రాధిపత్యం వహించింది.
పాక్ భారీ స్కోరు.. సమీర్ మిన్హాస్ వీరవిహారం
టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ భారత బౌలర్లకు నరకం చూపించాడు. కేవలం 113 బంతుల్లో 172 పరుగులతో (17 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా అహ్మద్ హుస్సేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) రాణించడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లు తీసినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

కుప్పకూలిన భారత బ్యాటర్లు
348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్నిచ్చినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే (2), ఆరోన్ జార్జ్ (16), వేదాంత్ త్రివేది (9), అభిజ్ఞాన్ కుందు (13) వరుసగా పెవిలియన్ చేరారు. పాక్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివర్లో దీపేష్ దేవేంద్రన్(36) ఒంటరి పోరాటం చేసినా అది ఓటమి తేడాను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. భారత్ చివరకు 26.2 ఓవర్లకు 156 పరుగులకే ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్ల పంజా
పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా 3 వికెట్లతో భారత వెన్నెముకను విరిచాడు. మహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా ఎహ్సాన్ తలో రెండు వికెట్లు తీసి భారత్ను కోలుకోలేని దెబ్బ తీశారు. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి పాక్ జట్టు ఫైనల్లో సరైన బదులు తీర్చుకుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న టీమిండియా ఫైనల్లో ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ను ఎగురవేసుకుపోయింది.