హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల వేలంపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇంటర్నల్ ఆర్బిటరీ అప్లికేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
బీసీసీఐ బంగారు బాతు ఐపీఎల్: మీడియా హక్కుల వేలం విశేషాలు
వివరాల్లోకి వెళితే.... సోమవారం జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్ హక్కుల్ని స్టార్ ఇండియా రూ.16,347.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్ ఇండియాకు ఈ హక్కులు దక్కడంపై ఆయన తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు.
స్టార్ ఇండియాకే మీడియా హక్కులు రావడంలో బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా హస్తముందని, అందుకుగానూ ఆయన రూ. 100 కోట్లు అందుకోనున్నారని సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నిర్వహించిన వేలంలో మొత్తం ఏడు కేటగిరీలుగా మీడియా హక్కులకు బీసీసీఐ టెండర్లు ఆహ్వానించింది.
ఈ వేలంలో అత్యధిక ధర కోట్ చేసిన స్టార్ ఇండియాకే బీసీసీఐ హక్కులను కేటాయించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అంటే భారత్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్, అమెరికాల్లో ఐపీఎల్ ప్రసార, డిజిటల్ హక్కులు స్టార్ ఇండియా పరమయ్యాయి. తాజా ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్కు ఈ హక్కులుంటాయి.
ఈసారి భారత్లో ప్రసార హక్కులకే సోనీ దాఖలు చేసిన బిడ్ విలువ రూ.11,050 కోట్లు. అయితే ఇదే విభాగానికి స్టార్ ఇండియా కోట్ చేసిన ధర రూ. 6,196 కోట్లు ఎంతో తక్కువే. కానీ.. డిజిటల్ హక్కులు కూడా కలిపి స్టార్ సమర్పించిన బిడ్ విలువ రూ. 16,347 కోట్లు సోనీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
భారత క్రికెట్ దశను మార్చిన ఐపీఎల్: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లీగ్
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద మీడియా హక్కుల ఒప్పందంగా ఇది నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం స్టార్ ఇండియా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్కు బీసీసీఐ రూ.55 కోట్లు చెల్లించనుంది. తాజా వేలం ప్రకారం ఐపీఎల్కు స్టార్ ఇండియా ఏడాదికి రూ.3,270 కోట్లు చెల్లిస్తుంది. ఇది ప్రస్తుతం టీమిండియా ఒక అంతర్జాతీయ మ్యాచ్కు చెల్లిస్తున్న దాని కన్నా రూ.12 కోట్లు అధికం కావడం విశేషం.
2008లో సోనీ సంస్థ ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ హక్కులకు పదేళ్ల కాలానికి రూ. 8,200 కోట్లు చెల్లించింది. ఇప్పుడు స్టార్ ఇండియా ఐదేళ్ల (2018-22) కాలానికే దానికి దాదాపు రెండింతలు (16,347 కోట్లు) వెచ్చించడం విశేషం. గతంలో సోనీ డీల్తో బీసీసీఐ ఏడాదికి రూ. 820 కోట్లు ఆర్జిస్తే.. ఇప్పుడు స్టార్ ఇండియా ఏడాదికి రూ. 3269 కోట్లు చెల్లించనుంది. అంటే సోనీ చెల్లించిన దానితో పోలిస్తే ఇది నాలుగింతలు ఎక్కువ.