PSL vs IPL: ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు ఘోర అవమానం జరిగింది. యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ను తమ దేశంలో నిర్వహించేందుకు యూఏఈ తిరస్కరించినట్లు తెలిసింది. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు ఆఫర్లు రావడం ప్రారంభించాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ను బీసీసీఐ మధ్యలోనే నిలిపివేసింది. ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇంగ్లాండ్ ఇప్పుడు టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది. భద్రత సక్రమంగా ఉంటే మిగిలిన మ్యాచ్లను మొదట ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) అడిగితే ఐపీఎల్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమదేశంలో ఈ మ్యాచ్లను తాము పూర్తి చేస్తామని వెల్లడించారు. ఐపీఎల్ ఇప్పుడు వారం రోజులుగా నిలిచిపోయింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ ఐపీఎల్ను ఇంగ్లాండ్లోనే పూర్తి చేయాలని సూచించారు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు భారత ఆటగాళ్లు అక్కడే ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా. మార్చి 22న మొదలైన ఐపీఎల్ 18వ సీజన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8 నాటి పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తారనే వార్తలు రాగా.. వారం పాటు నిలిపివేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
మేము వీలైనంత వరకు బీసీసీఐకి సహాయం చేస్తామని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ అన్నారు. బీసీసీఐ సహాయం కోరితే ఐపీఎల్లోని మిగిలిన మ్యాచ్లను నిర్వహించడానికి ఇంగ్లాండ్ సిద్ధంగా ఉంది. ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించాలనేది పెద్ద సమస్య. భారత టెస్ట్ పర్యటనకు ముందు టోర్నమెంట్ జరగాలంటే బీసీసీఐ, ఈసీబీ, ఇంగ్లాండ్ మైదానాలు త్వరగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో దేశవాళీ క్రికెట్ జరుగుతోంది. ఇది సమస్యలను కలిగిస్తుంది.
.