Gaming Ban: నగదుతో కూడిన ఆన్లైన్ గేమింగ్ను నిషేధించేందుకు ఉద్దేశించి "ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025" కు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది.
ఈ బిల్లు పోకర్, రమ్మీ, ఆన్లైన్ లాటరీలు, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ (సట్టా, జువా) వంటి అన్ని రకాల రియల్-మనీ గేమ్స్ను నిషేధిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించి నగదుతో కూడిన ఆన్లైన్ గేమ్స్ నిర్వహించేవారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. ఈ నేరాన్ని మళ్లీమళ్లీ చేసేవారికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్లు జరిమానా విధించవచ్చు.ఆన్లైన్ మనీ గేమ్స్ ప్రకటనల్లో పాల్గొన్నవారికి రెండేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా ఉంటుంది. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని ఈ బిల్లులో నేరస్థులుగా కాకుండా బాధితులుగా పేర్కొన్నారు.

ఈ బిల్లుపై గేమింగ్ పరిశ్రమ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధం కాకుండా, కేవలం నియంత్రణ విధించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు లేఖ రాశారు. ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయితే ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు.ఈ బిల్లు చట్టంగా మారితే, డ్రీమ్ 11, గేమ్స్ 24/7 వంటి సంస్థలకు, వాటికి ప్రచారం చేస్తున్న క్రికెటర్లు, సినీ నటులకు కూడా ఇది వర్తిస్తుంది.
ప్రకంపనలు సృష్టిస్తోన్న గేమింగ్ బిల్లు
ప్రస్తుతం ఈ బిల్లు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. నైపుణ్యం ఆధారిత గేమ్లతో సహా, అన్ని రియల్-మనీ గేమ్స్ను నిషేధించే ఈ బిల్లు, ఈ రంగానికి పెను నష్టం కలిగిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా 20,000 పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, దాదాపు 300 కంపెనీలు మూతపడొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిషేధం కేవలం గేమింగ్ పరిశ్రమకే పరిమితం కాకుండా దేశీయ క్రీడా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్లు కారణంగా దేశీయ స్థాయిలో జరిగే ఫ్రాంచెజ్ స్పోర్ట్స్ లీగ్లలో 50 శాతం వరకు మూతపడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ సంస్థలు లీగ్లకు, జట్లకు ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నాయి. ఈ నిషేధం వల్ల జట్లకు, లీగ్లకు వచ్చే స్పాన్సర్షిప్ ఆదాయం 30 నుంచి 40 శాతం వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రికెటేతర క్రీడలు, గ్రాస్ రూట్ స్థాయి క్రీడలు భారీగా నష్టపోతాయి. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థల ప్రకటనలు లేకపోతే ఈ క్రీడలు మనుగడ సాగించడం కష్టం కావచ్చని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల క్రీడా ప్రసారాల ఆదాయం కూడా తగ్గుతుందని అంటున్నారు.
భవిష్యత్తుకు ముప్పు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ డిజిటల్ పరిశ్రమలలో గేమింగ్ ఒకటి. వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై ప్రకారం, ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ విలువ 3.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ విలువ 2029 నాటికి 9.2 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగం ఇప్పటికే లక్షా 30 వేలకు పైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది.