జైపూర్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా జైపూర్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో న్యూజిల్యాండ్ పోరాడగలిగే స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. టీమిండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70; 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు), స్టార్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలు బాదారు. టీ20 ప్రపంచకప్ 2021లో మెరిసిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని కివీస్కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే న్యూజిల్యాండ్కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ డారిల్ మిచెల్ (0)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్మన్ (63)తో కలిసి మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70) ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. మరోవైపు చెత్త బంతులను బౌండరీలకు పంపారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. వీరిద్దరూ కలిసి శతక (109) భాగస్వామ్యం నిర్మించారు.
ప్రమాదకరంగా మారుతున్న సమయంలో మార్క్ చాప్మన్ను స్పిన్నర్ ఆర్ అశ్విన్ అవుట్ చేశాడు. ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ (0)ను కూడా యాష్ పెవిలియన్ చేర్చాడు. ఆపై భారీ సిక్సులతో చెలరేగుతున్న మార్టిన్ గప్తిల్ను దీపక్ చహర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే టిమ్ సేఫెర్ట్ (12)ను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డుకు బ్రేకులు పడ్డాయి. రచిన్ రవీంద్ర (7)ను మొహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. చివరకు మిచెల్ సాంట్నర్ (4), టీమ్ సౌథీ (0)లు క్రీజులో ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 164/6 స్కోరు చేసింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్ 2, భువనేశ్వర్ కుమార్ 2.. దీపక్ చహర్, మొహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. రాహుల్ ద్రవిడ్ కోచ్గా, రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్తో స్వదేశంలో భారత్ సిరీస్ వేటను ప్రారంభించింది.