బ్రిస్బేన్: నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొలిరోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కామెరాన్ గ్రీన్ (28; 70 బంతుల్లో 3x4), టిమ్ పైన్ (38; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు. మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) సెంచరీ చేయగా.. మాథ్యూ వేడ్ (45; 87 బంతుల్లో 6x4) ఆకట్టుకున్నాడు. లబుషేన్ ఇన్నింగ్స్తో తొలిరోజు ఆటలో ఆసీస్దే పై చేయిగా నిలిచింది. భారత బౌలర్లలో టీ నటరాజన్ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ.... 'సెంచరీ చేశాక ఎగిరి గంతులేయకుండా ప్రశాంతంగా ఉండాలనే అనుకుంటా. పరిస్థితులను బట్టి ముందుకు సాగుతా. సెంచరీ కొడితే..సెలబ్రేట్ చేసుకోను. అయితే ఈరోజు మ్యాచ్లో 108 తర్వాత ఔటవ్వడం కాస్త నిరాశ పర్చింది. టిమ్ పైన్, కామెరాన్ గ్రీన్ బాగా ఆడుతున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మేం కాస్త ఆధిపత్యంలో ఉన్నాం' అని తెలిపాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. సిరిస్లో సరైన ఫామ్లో లేక ఇబ్బందిపడుతున్న డేవిడ్ వార్నర్ (1)ని సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఆడిన తొలి ఓవర్ నాలుగో బంతికి స్లిప్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం బౌలింగ్కు దిగిన ఠాకూర్ తాను వేసిన తొలి బంతికే మార్కస్ హారిస్ను ఔట్ చేశాడు. స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సుందర్ చక్కని క్యాచ్ పట్టాడు. 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును లబుషేన్.. స్మిత్, వేడ్తో కలిసి ఆదుకున్నాడు. తొలుత స్మిత్తో మూడో వికెట్కు 70 పరుగులు జోడించిన అతడు తర్వాత వేడ్తో నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేశాక నటరాజన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఇప్పటికే నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్, ఆసీస్ 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్ను టీమిండియా ఓడిపోగా.. రెండో మ్యాచ్ను భారత్ గెలిచింది. మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడటానికి భారత్ నుంచి 11 మంది ఉంటారా? అనే పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. సిరీస్లో ప్రతి టెస్టుకు ముందు రోజే భారత జట్టు కూర్పును ప్రకటించేవారు. కానీ చివరి టెస్టు విషయానికి వచ్చేసరికి టాస్కు కాస్త ముందుగా వెల్లడించారు.
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!