
భారీ మార్పులు:
భారత పర్యటన కోసం ఆసీస్ జట్టులో భారీ మార్పులు చేసింది. టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న మార్నస్ లబుషేన్కు వన్డే జట్టులో సీఏ అవకాశం ఇచ్చింది. దీంతో లబుషేన్ తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది టెస్ట్ క్యాప్ సంపాదించినప్పటి నుండి లబుషేన్ 58.05 సగటున పరుగులు చేసాడు. ఇక చివరి మూడు టెస్ట్ మ్యాచ్లలో సెంచరీలు సాధించాడు.

స్టార్ ఆటగాళ్లు దూరం:
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయినిస్, నాథన్ లయాన్, గ్లెన్ మాక్స్వెల్లకు జట్టులో చోటు దక్కలేదు. పేసర్ బెరెన్డార్ఫ్ గాయంతో దూరమయ్యాడు. ఆల్రౌండర్ సీన్ అబోట్ ఐదేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ అష్టన్ అగర్ మరో అవకాశం దక్కించుకున్నాడు. జోష్ హాజిల్వుడ్కు చోటు దక్కింది.

టర్నర్ భారత్లో రాణించగలడు:
చీఫ్ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ మాట్లాడుతూ... 'లబుషేన్ వైట్ బాల్ క్రికెట్లో కూడా రాణించగలడని నమ్ముతున్నాం. టీ20 పవర్ హిట్టర్ ఆస్టన్ టర్నర్ భారత్లో రాణించగలడు. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని సత్తా చాటుతాడు. మాక్స్వెల్ బిగ్బాష్ లీగ్లో ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది' అని అన్నాడు.

జనవరి 14న తొలి వన్డే:
భారత పర్యటనలో ఆసీస్ హెడ్ కోచ్గా సీనియర్ అసిస్టెంట్ కోచ్ మెక్ డొనాల్డ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ పర్యటన జనవరి 14న మొదలై.. 19తో ముగుస్తుంది. జనవరి 14న తొలి వన్డే (ముంబై), 17న రెండో వన్డే (రాజ్కోట్), 19న మూడో వన్డే (బెంగళూరు)లో జరగనుంది. త్వరలో భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించనుంది.

ఆసీస్ జట్టు:
ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, హ్యాండ్స్కాంబ్, హేజిల్వుడ్, మార్నస్ లబుషేన్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ టర్నర్, ఆడమ్ జంపా.


Click it and Unblock the Notifications












