కోల్కత్తా: 66 బంతుల్లో 85 పరుగులు (నాటౌట్) గొప్ప ఇన్నింగ్స్ ఆడి వెస్టిండిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన మార్లోన్ శామ్యూల్స్ రెండోసారి ఆ దేశానికి వరల్డ్ కప్ అందించి చరిత్ర సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.... 2012లో వెస్టిండిస్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ అందుకున్నప్పుడు శామ్యూల్స్ విండిస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 137 పరుగులు చేసింది. అయితే అందులో శామ్యూల్స్ 78 పరుగులు చేయడం విశేషం. ఆనాడు సొంతగడ్డపై చెలరేగుతున్నశ్రీలంక బౌలర్లకు ఎదురు నిలిచి మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
కాగా, ఆదివారం కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అదే స్థాయి పోరాట పటిమను ప్రదర్శించాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వెస్టిండిస్ జట్టును విజయం అంచు వరకు తీసుకెళ్లాడు. ఇలా ఓ ఆటగాడు తన జట్టుకు రెండోసారి వరల్డ్ కప్ను అందించిన చరిత్ర సృష్టించాడు.

85 పరుగులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శామ్యూల్స్(85 పరుగులు నాటౌట్)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సులు కొట్టి వెస్టిండిస్ జట్టుకు విజయాన్ని అందించింది బ్రాత్ వైట్ అయినప్పటికీ... తన వీరోచిత బ్యాటింగ్తో వెస్టిండిస్ను పోటిలోకి తీసుకొచ్చింది మాత్రం శామ్యూల్సే.
ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై వెస్టిండిస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఇదే వేదికపై 1987లో వన్డే వరల్డ్ కప్ను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు మళ్లీ మరో ప్రపంచ కప్ను తృటిలో చేజార్చుకుంది.
ఇదిలా ఉంటే ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో వెస్టిండిస్ పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ను తొలిసారి గెలిచి ఆ దేశ క్రికెట్ ప్రతిష్టను మరింతగా పెంచాయి. అంతేకాదు ఈ ఏడాదే జరిగిన అండర్-19 ప్రపంచకప్లోనూ వెస్టిండిస్ విజయం సాధించడం విశేషం.