
మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా బ్యాట్స్మన్ భారీస్కోరు సాధిస్తే.. బౌలర్లే గెలిపిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసి భారీస్కోరు సాధిస్తే.. భారత్ పుంజుకోవచ్చని అన్నాడు. అత్యుత్తమ పేస్ దశం ఉండటం టీమిండియాకు సానుకూలాంశమని తెలిపాడు. అయితే శనివారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో మొదటగా టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ చేస్తోంది. మార్క్ టేలర్ చెప్పినట్టు భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్నారు.
'భారీస్కోరు సాధిస్తే టీమిండియాకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ భారత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో బ్యాటింగ్ ఆర్డర్, నాయకత్వంలో తప్పకుండా లోటు ఏర్పడుతుంది. కాని పుజారా, రహానే వంటి అత్యుత్తమ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. భారీస్కోరు సాధిస్తే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయగల బౌలింగ్ దాడి భారత్ సొంతం. స్కోరు బోర్డుపై పరుగులు ఉంటే చాలు బౌలర్లు మిగతా పని పూర్తి చేస్తారు. మెల్బోర్న్లో మొదటి రోజు ఆట ఈ సిరీస్లో టీమిండియాకు అత్యంత కీలకం' అని మార్క్ టేలర్ చెప్పాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను డే/నైట్ మ్యాచ్తో ఆరంభించడం టీమిండియాకు చేటుచేసిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. 'సిరీస్ను గులాబి బంతితో మొదలుపెట్టడం బ్యాట్స్మెన్లో కొంత కంగారు పుట్టించేదే. చివరగా భారత జట్టు ఫిబ్రవరిలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు. ఆస్ట్రేలియాలో ముందుగా టీ20లు, ఆ తర్వాత వన్డేలు ఆడి తర్వాత టెస్టు సిరీస్ ఆడుండాలి. అందులోనూ ముందు మూడు టెస్టులు ఎర్ర బంతితో ఆడి.. చివరగా గులాబి బంతితో మ్యాచ్ ఆడి ఉంటే పరివర్తన సులువుగా ఉండేది' అని సచిన్ అన్నాడు.
ఈరోజు ప్రారంభం అయిన బాక్సింగ్డే టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా 124 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 41.5 ఓవర్కు అర్ధశతకం వైపు పయనిస్తున్న ట్రావిస్ హెడ్ (38) ఔటయ్యాడు. ఆపై మహ్మద్ సిరాజ్ 49.3 ఓవర్లో ప్రమాదకర బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ (48)ను ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 134 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కామరూన్ గ్రీన్, టిమ్ పైన్ ఉన్నారు.