
హైదరాబాద్: వరల్డ్కప్లో భాగంగా బుధవారం పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే, పాక్తో మ్యాచ్కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. వెన్ను భాగంలో గాయం కారణంగా ఆస్ట్రేలియా మీడియం పేస్ బౌలర్ మార్కస్ స్టొయినిస్ ఈ మ్యాచ్కి దూరమయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఓవెల్ వేదికగా గత ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్లో మార్కస్ స్టోయినిస్ గాయపడిన సంగతి తెలిసిందే. స్టోయినిస్ స్థానంలో మిచెల్ మార్ష్ను క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకోనుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పాక్తో మ్యాచ్కి ముందు స్టొయినిస్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తారు.
ఇందులో అతడు ఫిట్గా ఉంటే వరల్డ్కప్లో ఆడే ఆస్ట్రేలియా 15 మంది జట్టు సభ్యుల్లో ఉంటాడు. లేకపోతే టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కసారి ఆటగాడు వరల్డ్కప్ నుంచి వైదొలిగితే తిరిగి మళ్లీ జట్టులోకి రాకూడదు. మరోవైపు మిచెల్ మార్ష్ ఈ నెల చివరలో ఇంగ్లాండ్కు వేరే టోర్నీ కోసం రావాల్సి ఉంది.
అయితే, వరల్డ్కప్లో మార్కస్ స్టోయినిస్ గాయపడటంతో అతడు ముందుగానే ఇంగ్లాండ్ రావాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందింది. ఈ మధ్య కాలంలో మార్కస్ స్టోయినిస్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరుపున ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అతడు ఫరవాలేదనిపించాడు. ఆప్ఘనిస్థాన్, ఇండియాలతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ రెండు రెండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా భారత్తో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్ ధోనీని ఒంటి చేత్తో క్యాచ్ పట్టి పెవిలియన్కు చేర్చాడు. టోర్నీలో భాగంగా అస్ట్రేలియా తదుపరి మ్యాచ్లో టాంటన్ వేదికగా బుధవారం పాకిస్థాన్తో తలపడనుంది.