29 మ్యాచులు ముగిశాక:
ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచులకు గాను 29 మ్యాచులు ముగిశాక ఆటగాళ్లు మహమ్మారి బారిన పడ్డారు. కోల్కతాలో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్.. హైదరాబాద్లో వృద్ధిమాన్ సాహా.. ఢిల్లీలో అమిత్ మిశ్రా.. చెన్నైలో లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ పాజిటివ్గా తేలారు. ఐపీఎల్ బయో బుడగ బలహీనమవ్వడంతో సీజన్ను బీసీసీఐ వాయిదా వేసింది. ఆ తర్వాత మరికొందరు ఆటగాళ్లు, సిబ్బందికి పాజిటివ్ రావడం గమనార్హం. అయితే ఇప్పుడు అందరూ కోలుకోవడం సానుకూలాంశం.
అవగాహన లేకపోవడమే కారణం:
'కరోనా టీకా తీసుకోవడానికి ఆటగాళ్లు నిరాకరించారు. ఇది వారి తప్పేమీ కాదు. అవగాహన లేకపోవడమే కారణం. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం క్రికెటర్లను ఒప్పించాయి. చాలా మంది జ్వరం వస్తుందని భయపడ్డారు. బయో బుడగ సురక్షితమే కాబట్టి.. టీకా అవసరం లేదని భావించారు. ఆటగాళ్ల ఆరోగ్యంకు సంబందించిన విషయం కాబట్టి యాజమాన్యాలు సైతం ఒత్తిడి చేయలేదు. ఆ తర్వాత పరిస్థితి చేజారింది. విదేశీ ఆటగాళ్లు, సిబ్బంది తీసుకోవడానికి ముందుకొచ్చినా వారికి వేయించడం చట్టబద్ధం కాదు. దాంతో కుదర్లేదు' అని బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి.
వ్యాక్సిన్ కోసం క్యూ:
ఐపీఎల్ బయో బుడగలో లోపాలున్నాయని ఫ్రాంచైజీలు భావించాయని తెలిసింది. ఆటగాళ్లను ప్రత్యేక ఛార్టర్ విమానాల్లోనే మిగతా వేదికల వద్దకు తీసుకెళ్లారు. అయితే విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఇతరులు ఎక్కువ మందే ఉన్నారట. అందులో ఎవరెవరు వ్యాక్సిన్ వేయించుకున్నారో లేదో తెలియదు. పైగా ఇతర సిబ్బంది పరిస్థితీ తెలియదని ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. అయితే మొదటగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నో చెప్పిన క్రికెటర్లు.. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ కోసం వరుసగా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకుంటున్నారు.
ఇంగ్లండ్ వెళ్లాక సెకండ్ డోస్:
జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీసేన.. అక్కడ న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. నెల రోజుల తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఢీకొట్టబోతోంది. 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించగా.. ఇప్పటికే టీమ్లో సగం మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా మొదటి డోస్ వేసుకున్నారు. ఇక సెకండ్ డోస్ ఇంగ్లండ్ వెళ్లాక వేయించుకోనున్నారు.