
హైదరాబాద్: సోమవారం ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్ మనీష్ పాండేను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందించాడు. జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మనీష్ పాండేకు ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపాడు.
ఈ మేరకు కోహ్లీ తన ట్విట్టర్లో "అభినందనలు పాండే జీ. మీ ఇద్దరి జీవితంలో అందమైన క్షణాలు, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరినీ దేవుడు ఆశీర్వదించుగాక" అని ట్వీట్ చేశాడు.
మరోవైపు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొత్త జంటకు ట్విట్టర్లో అభినందనలు తెలిపాడు. ఈ మేరకు రోహిత్ శర్మ తన ట్విట్టర్లో "ప్రపంచంలోని అన్ని ఆనందాలు మీ సొంతం కావాలని కోరుకుంటున్నాను. నన్ను నమ్మండి. ఇది నీ ఉత్తమ ఇన్నింగ్స్" అంటూ ట్వీట్ చేశాడు.
సినీనటి ఆశ్రిత శెట్టిని మనీష్ పాండే సోమవారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ సంప్రదాయ ప్రకారం జరిగిన వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. మనీష్-ఆశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ తన ట్వీటర్ అకౌంట్లో మనీష్-ఆశ్రిత పెళ్లి ఫొటోను పోస్ట్ చేసింది. 'మనీష్-ఆశ్రితలకు శుభాకాంక్షలు. మీకు ఆనందం, ప్రేమ కలగాలని కోరుకుంటున్నాం' అని రాసుకొచ్చింది.