
మెరిసిన గార్డ్నర్:
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్నర్ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. బెత్ మూనీ 16 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.

చెలరేగిన షెఫాలీ:
లక్ష్య చేధనకు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మందాన్న, షెఫాలీ వర్మల జోడీ శుభారంభం అందించింది. తొలి వికెట్కి 85 పరుగులు జోడించిన తర్వాత ఎల్లీస్ పెర్రీ బౌలింగ్లో వర్మ (49; 18 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్) పెవిలియన్ చేరింది. వర్మ అద్భుతంగా ఆడి ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన జమిమా రోడ్రిక్స్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అలీసా హేలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.

మందాన్న అర్ధ సెంచరీ:
ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా స్మృతి మందాన్న మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేసింది. కీలక సమయంలో బ్యాట్ జులిపించి (55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. మందాన్న ఔట్ అయినా.. దీప్తి శర్మ (11), హర్మన్ ప్రీత్ కౌర్ (20) నాటౌట్గా నిలిచారు. ఫలితంగా భారత్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. భారత మహిళల జట్టుకు టీ20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం.

సిరీస్ ఆశలు సజీవం:
ముక్కోణపు టీ20 టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సిరీస్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక మూడు మ్యాచ్లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications
