న్యూఢిల్లీ: ఆస్టేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణం నేపథ్యంలో ఆస్టేలియాలో పర్యటనను కొనసాగించకుండా టీమిండియాను అడ్డుకోవాలని కోరుతూ పడుకొట్టాయ్కి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఆస్టేలియా బౌన్సీ పిచ్లని, ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పిటీషనర్ ప్రవీణ్ కుమార్ వాదిస్తున్నాడు. క్రికెట్ బంతి తగిలి 1870 నుంచి నలుగురు ఆటగాళ్లు చనిపోయారని, ఆటగాళ్లకు పూర్తి రక్షణ ఇస్తే తప్ప టీమిండియా.. ఆస్టేలియా పర్యటనను కొనసాగించరాదని పిటిషన్లో అతడు పేర్కొన్నాడు.

పిటీషనర్ ప్రవీణ్ కుమార్ వేసిన పిటిషన్ వచ్చేవారం ధర్మాసనం ముందుుకు విచారణకు రానుంది. దేశీయ క్రికెట్ టోర్నీలో వేసిన బౌన్సర్ తలకు బలంగా తాకడంతో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.
1959లో అబ్దుల్ అజీజ్... 19 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతుండగా, బంతి తన ఛాతికి బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. చివరకు ఆసుపత్రిలో మరణించాడు. 1960లో వెస్టిండిస్ బౌలర్ చార్లీ గ్రిఫ్రిత్ వేసిన బౌన్సర్ భారత క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ తలకు బలంగా తగలడంతో ఆరు రోజులు కోమాలోకి వెళ్లాడు. ఆ తర్వాత నారీ కాంట్రాక్టర్ క్రికెట్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.