కోల్కతా మ్యాచ్ రద్దు
దక్షిణాఫ్రికాతో జరగాల్సిన కోల్కతా వన్డేను బీసీసీఐ రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 18న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మూడో వన్డే జరగాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ మ్యాచ్తో పాటు మూడు వన్డేల సిరీస్ను బీసీసీఐ రద్దు చేసింది. అయితే తనకే మాత్రం సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం (కోల్కతా మ్యాచ్ రద్దు) తీసుకోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని దీదీ తప్పుబట్టారు.
ఇదేనా మీ గౌరవం
'సౌరవ్ గంగూలీతో ఎలాంటి విభేదాలు లేవు. కానీ కోల్కతా మ్యాచ్ రద్దుకి ముందు ఒక మాట అయినా ప్రభుత్వంతో చెప్పి ఉండాల్సింది. కనీసం ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్లలో ఎవరికైనా సమాచారం ఇవ్వాలి కదా. మ్యాచ్ రద్దయిన తర్వాత విషయం చెపితే ఉపయోగమేంటి. మేము మ్యాచ్ని నిలిపివేయమని ఏమీ అడగలేదు. ప్రభుత్వ పెద్దలకి ఒక మాట చెప్పడం కనీస గౌరవం' అని మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు.
బెంగాల్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు
గత వారం రోజులుగా తమ రాష్ట్రంలో ఐపీఎల్ నిర్వహించొద్దంటూ కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుతాన్ని కోరాయి. కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా కోర్టులో కేసులు కూడా వేసాయి. కానీ పశ్చిమ బెంగాల్ మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన దాదా.. బీసీసీఐ అధ్యక్షుడు అవగానే సంతోషించిన వ్యక్తుల్లో సీఎం మమతా బెనర్జీ ఒకరు. అయితే మ్యాచ్ రద్దు విషయంలో తమ ప్రభుత్వానికి ఒక మాట కూడా చెప్పకపోవడంపై మమతా కోపంగా ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికైతే చెప్పలేను
ఐపీఎల్ పాలక మండలి సమావేశం ముగిసిన తర్వాత సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ను కుదిస్తారా అని ప్రశ్నించగా... 'ప్రస్తుతం ఐపీఎల్ గురించి నేనేమీ చెప్పలేను. అప్పటికి ఉండే పరిస్థితుల్ని బట్టే ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. టోర్నీని 15 రోజులు వాయిదా వేశామంటే అన్ని రోజుల సమయం పోయినట్టే కదా. ఒకవేళ ఏప్రిల్ 15 నాటికి పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్ను కుదిస్తాం. ఎన్ని రోజులు, ఎన్ని మ్యాచులు తగ్గిస్తామో ఇప్పటికైతే చెప్పలేను' అని దాదా స్పష్టం చేసారు.