
కోల్కతా: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామకం దాదాపు ఖరారైంది. దీంతో ప్రస్తుతం గంగూలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీకి హార్ధికపూర్వక శుభాకాంక్షలు అని సీఎం మమతా ట్వీట్ చేశారు.
'బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సౌరవ్ గంగూలీకి హార్ధికపూర్వక శుభాకాంక్షలు. మీ పదవీ కాలం ఉత్తమంగా సాగాలని కోరుకుంన్నా. ఆల్ ది బెస్ట్. భారత్, బంగ్లాను గర్వంగా నిలిపారు. బెంగాల్ సంఘం అధ్యక్షుడిగా అద్భుత సేవలు అందించారు. మరో కొత్త ఇన్నింగ్స్ సాఫీగా సాగాలని కోరుకుంటున్నా. కొత్త ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నా' అని ట్వీట్లో మమతా బెనర్జీ రాసుకొచ్చారు.
బ్రిజేశ్ పటేల్ను వెనక్కి నెట్టేస్తూ.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుని రేసులో సౌరవ్ గంగూలీ ముందంజలో ఉన్నారు. బీసీసీఐ ఎన్నికలలో ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం సాయంత్రం ఒప్పందం కుదిరింది. ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ. అయితే తాజా ఒప్పందం నేపథ్యంలో గంగూలీ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
అధ్యక్షుని రేసులో ముందంజలో ఉన్న గంగూలీ తన తొలి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్క్లాస్ క్రికెట్కే అని స్పష్టం చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆధారంగా ఆటగాళ్లను జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే.. అప్పుడు మరింత బలోపేతం అవ్వడానికి ఆస్కారం ఉందన్నాడు. ఈ విషయాన్ని గతంలో క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ)కు చెప్పినా.. దాన్ని పెడచెవిన పెట్టారని గంగూలీ అంటున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఎంపిక కానున్నారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ బోర్డు కోశాధికారిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.