మహిళా వరల్డ్ కప్ విజేత రిచా ఘోష్ను సన్మానించే కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బెంగాల్ ఐకాన్, మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అధ్యక్ష పదవికి గంగూలీయే సరైన వ్యక్తి అని సీఎం మమతా బెనర్జీ గట్టిదా వాదించారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా హాజరయ్యారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంగూలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. "సౌరవ్ గంగూలీ భారత జట్టు కెప్టెన్గా ఎక్కువ కాలం కొనసాగాలని మేము ఎప్పుడూ కోరుకునేవాళ్లం. మరో విషయం చెప్పాలి. గంగూలీకి ఇది చెడ్డగా అనిపించవచ్చు.. కానీ నేను ముక్కుసూటిగా మాట్లాడేదాన్ని, చేదు నిజం చెప్తాను." అని అన్నారు. ఆమె తన మాటలను కొనసాగిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావించారు. "ఈరోజు ఐసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాల్సింది? మరొకరు కాదు, సౌరవ్ గంగూలీ మాత్రమే. ఆయన ఇప్పుడే ఆ పదవిని చేపట్టకపోయినా, ఒకరోజు తప్పకుండా అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన్ని ఆపడం అంత సులభం కాదు." అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఐసీసీ అధ్యక్ష రేసులో గంగూలీ
గతంలో గంగూలీకే తదుపరి ఐసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా పరిణామాలు మారాయి. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఉన్నారు. జై షా బీసీసీఐ కార్యదర్శిగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత డిసెంబర్ 2024లో అత్యంత పిన్న వయస్కుడైన ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2022 వరకు సౌరవ్ గంగూలీ, జై షా బీసీసీఐలో కలిసి పనిచేశారు. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి ఆయన స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జై షా గ్లోబల్ క్రికెట్ బాడీకి నాయకత్వం వహించారు. గంగూలీ తదుపరి ఐసీసీ ఛైర్మన్ అవుతారని విస్తృతంగా భావించినప్పటికీ.. ఆయన అకస్మాత్తుగా ఈ రేసు నుంచి వైదొలగడం అప్పట్లో రాజకీయంగా చర్చకు దారి తీసింది.
రిచా ఘోష్కు బెంగాల్ ప్రభుత్వం ఘన సన్మానం
మహిళా ప్రపంచకప్ గెలిచిన పశ్చిమ బెంగాల్ తొలి క్రికెటర్ అయిన రిచా ఘోష్ను ఈ సందర్భంగా మమతా బెనర్జీ ఘనంగా సన్మానించారు. బెంగాల్ ప్రభుత్వం ఆమెకు అత్యున్నత పౌర పురస్కారం'బంగ భూషణ్'తో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పదవి నియామక పత్రం, బంగారు గొలుసును అందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రిచాకు భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ కప్ ఫైనల్లో రిచా చేసిన ప్రతి పరుగుకు ఒక లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.34 లక్షల భారీ చెక్ను అందించారు. క్యాబ్ తరఫున ఆమెకు ఒక అందమైన బంగారు బ్యాట్, బంతిని కూడా బహూకరించారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు గంగూలీని ఐసీసీ అధ్యక్షుడిగా చూడాలని బెంగాల్ ప్రజలు బలంగా కోరుకుంటున్నారనే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి.