కొలంబో: శ్రీలంక బౌలర్ మలింగ యార్కర్ల దెబ్బకు కెన్యా విలవిలలాడింది. అతను హ్యాట్రిక్ తో ప్రపంచ కప్ పోటీల్లోకి ప్రవేశించాడు. దాంతో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో కెన్యాను ఓడించింది. మొదట మలింగ (6/38) దెబ్బకు కెన్యా 142 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్యాన్ని లంక 18.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మలింగకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు దిల్షాన్ (44; 30 బంతుల్లో 8X4) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. తెరిపి లేకుండా బౌండరీలు బాదుతూ కెన్యా బౌలర్లను బెంబేలెత్తించాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన్యాకు పేలవ ఆరంభం లభించింది. 8 పరుగులకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడటంతో కెన్యా ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. క్రీజులోకి వచ్చిన ఒబుయ సోదరులు జట్టును రక్షించే ప్రయత్నం చేశారు. ఐతే ఈ క్రమంలో వారు మరీ నెమ్మదిగా, పరుగులు తీయడమే పాపమన్నట్లు ఆడారు. 50 ఓవర్లు నిలవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఐతే వీరు చాలాసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మధ్యలో ఓసారి కెన్యా, ఓసారి లంక ఎల్బీ నిర్ణయాలపై సమీక్షకు వెళ్లగా ఫలితాలు కెన్యాకే అనుకూలంగా వచ్చాయి. దాదాపు 30 ఓవర్ల పాటు పెద్దగా పరుగులూ రాక వికెట్లు పడక స్టేడియంలో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు.42వ ఓవర్ చివరి బంతికి తన్మయ్ (0)ను ఎల్బీగా బలిగొన్న మలింగ 44వ ఓవర్లో మళ్లీ బౌలింగ్ కు వచ్చాడు. వరుసగా ఒంగాండో (0), షెమ్ గాచె (0)లను బౌల్డ్ చేసి ప్రపంచకప్ లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. మధ్యలో ఒక బంతి విరామం. నాలుగో బంతికే ఒటీనో (0)ను ఔట్ చేసి ఆరో వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అతను తీసిన ఆరు వికెట్లలో నాలుగు బౌల్డ్ కాగా రెండు ఎల్బీలు. మలింగ తీసిన వికెట్లన్నీ యార్కర్ల ద్వారానే రావడం విశేషం. కెన్యా చివరి 8 వికెట్లను 41 పరుగుల తేడాలో కోల్పోయింది.