అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్-2024లో డిఫెండింగ్ ఛాంపియన్ 'ముంబై ఇండియన్స్ న్యూయార్క్' తొలి పరాజయాన్ని చవిచూసింది. ప్రారంభ మ్యాచ్లో సీటెల్ ఓర్కాస్పై ఘన విజయం సాధించిన ఎంఐ న్యూయార్క్ రెండో మ్యాచ్లో ఓటమిపాలైంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో శనివారం జరిగిన పోరులో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో ఓడింది.
వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగలేదు. ఛేదనలో వాషింగ్టన్ 7.4 ఓవర్లు ఆడిన సందర్భంలో ఉరుములు, మెరుపులతో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగించడానికి సాధ్యం కాలేదు. దీంతో అంపైర్లు డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం విజేతను ప్రకటించారు. అయితే మ్యాచ్ పూర్తిగా సాగితే ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఓటమిపాలయ్యే అవకాశాలు తక్కువగా ఉండేవి. ఎందుకంటే మందకొడి పిచ్పై వాషింగ్టన్ బ్యాటర్లు పరుగులు కోసం శ్రమించారు.

చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట ముంబై ఇండియన్స్ న్యూయార్క్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. గత మ్యాచ్ హీరో నికోలస్ పూరన్ (44; 30 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి చెలరేగాడు. రషీద్ ఖాన్ (31; 15 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రూబెన్ క్లింటన్ (28; 22 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. కెప్టెన్ పొలార్డ్ (3; 6 బంతుల్లో) నిరాశపరిచాడు. సౌరభ్ నేత్రావల్కర్, జస్టిన్ డిల్ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.
అనంతరం ఛేదన ప్రారంభించిన వాష్టింగ్టన్ ఫ్రీడమ్ వరుణుడు ఎంట్రీ ఇచ్చే సమయానికి 7.4 ఓవర్లకు 55 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (46; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రిస్ గౌస్ (5; 11 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. అయితే వర్షం వచ్చే సమయానికి డక్వర్త్లూయిస్ పద్ధతి ప్రకారం వాషింగ్టన్ 51 పరుగులు సాధించాల్సి ఉంది. ఆ జట్టు మరో నాలుగు పరుగులు ఎక్కువగానే సాధించడంతో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఓటమిపాలైంది.