అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్-2024 ఘనంగా ఆరంభమైంది. ప్రారంభమ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ 'ముంబై ఇండియన్స్ న్యూయార్క్' సత్తాచాటింది. సీటెల్ ఓర్కాస్తో శుక్రవారం జరిగిన పోరులో ఆరు వికెట్ల తేడాతో నెగ్గి ముంబై ఘనంగా బోణీ కొట్టింది. టీ20 వరల్డ్ కప్ ఫామ్ను కొనసాగిస్తూ నికోలస్ పూరన్ చెలరేగాడు. చర్చ్ స్ట్రీట్ పార్క్ పిచ్పై ఇతర బ్యాటర్లు పరుగులు కోసం కష్టపడితే పూరన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.
పూరన్ 37 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సీటెల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ 19.1 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ రంజనె (35; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. హర్మీత్ సింగ్ (20; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ (5; 5 బంతుల్లో) నిరాశపరిచాడు. ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (3/25), రషీద్ ఖాన్ (3/22) చెరె మూడు వికెట్లతో సత్తాచాటారు.

బౌల్ట్, రషీద్ ధాటికి సీటెల్ 58 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన హర్మీత్తో కలిసి శుభమ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించాడు. కానీ ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి దెబ్బకొట్టారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 14.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పూరన్ మెరుపు అర్ధశతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే ముంబైకు పేలవారంభం దక్కింది. ఓపెనర్లు మొనాంక్ పటేల్ (8; 12 బంతుల్లో,1 ఫోర్), రుబెన్ (6; 5 బంతుల్లో, 1 ఫోర్) ఆదిలోనే ఔటయ్యారు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన పూరన్ ఇన్నింగ్స్ స్వరూపమే మార్చాడు. సహచరులు బంతుకో పరుగు తీయడానికే కష్టపడుతుంటే పూరన్ బౌండరీలతో హోరెత్తించాడు. అతని ధాటికి ముంబై పవర్ప్లేలో 55 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన జహంగీర్ (3), టిమ్ డేవిడ్ (12) ఔటైనా కెప్టెన్ పొలార్డ్ (8 నాటౌట్)తో కలిసి పూరన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.