
ధోనీ ఏదో చెప్పాడు:
శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్లో తాను ఎంఎస్ ధోనీ ఆగ్రహానికి గురయ్యానని, అప్పుడు తనకు చాలా భయమేసిందని కుల్దీప్ యాదవ్ చెప్పాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన కుల్దీప్ .. ధోనీ ఆగ్రహానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'మూడేళ్ల క్రితం ఇండోర్లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో కుశాల్ పెరీరా బ్యాటింగ్ చేస్తుండగా నేను బౌలింగ్ చేశాను. అప్పటికే నా బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టి పెరీరా జోరుమీదున్నాడు. అప్పుడు ధోనీ ఏదో చెప్పాడు. అది నాకు సరిగ్గా అర్థం కాలేదు' అని కుల్దీప్ తెలిపాడు. తర్వాత బంతికి ఫీల్డింగ్ సెట్ చేసుకోమని ధోనీ చెప్పాడట. కాగా, అది కుల్దీప్కు వినిపించలేదట.

నేనేమైనా పిచ్చోడినా?:
'కుల్దీప్ వేసిన తర్వాతి బంతికి పెరీరా రివర్స్ స్వీప్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లింది. దాంతో పట్టరాని కోపంతో మహీ భాయ్ నా దగ్గరకు వచ్చి గట్టిగా అరిచాడు. నేనేమైనా పిచ్చోడినా?, 300 వన్డేలు ఆడాను. ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం చేస్తున్నా. నువ్వు నా మాట వినడం లేదు అని నాతో అన్నాడు. దాంతో ఒక్కసారిగా భయపడిపోయా' అని చైనామన్ బౌలర్ ఆనాటి పరిస్థితిని వివరించాడు. అలా ధోనీలో కోపాన్నిచూడటం తొలిసారని చెప్పాడు.

20 ఏళ్ల తర్వాత కోప్పడ్డా:
ఇక మ్యాచ్లో గెలిచాక జట్టు హోటల్కు వెళుతుంటే.. ధోనీతో మాట్లాడానని కుల్దీప్ చెప్పాడు. 'మహీ భాయ్ నీకు కోపం కూడా వస్తదా అని అడిగితే.. నాకు అస్సలు కోపం రాదు. 20 ఏళ్ల క్రితం చివరిసారి కోపడ్డా. ఇప్పుడు అనుభవం వచ్చాక అందరితో మాట్లాడాలి. అప్పుడు ఎవరైనా మాట వినకపోతే వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తా. అది కోపం కాదు. నువ్వింకా నా కోపాన్ని చూడలేదు. రంజీట్రోఫీ ఆడే రోజుల్లో నాకు కోపం వస్తుండేది' అని ధోనీ నాతో అన్నాడు. టీమిండియాతో ఆడేటప్పుడు ఒక్కోసారి కోపం వచ్చినా అది ఎవరికీ తెలియనిచ్చేవాడిని కాదని ధోనీ చెప్పాడు' అని కుల్దీప్ వెల్లడించాడు.

ప్రపంచకప్ తర్వాత దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.


Click it and Unblock the Notifications
