ఢాకా: బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. అంతర్జాతీయంగానూ ప్రముఖ క్రికెటర్గా పేరుతెచ్చుకున్న ఆ ఆటగాడు ఓ మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. ఆ బాధలు భరించలేక ఆమె అతని ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో అతని కర్కశత్వం ప్రపంచానికి తెలిసింది.
తాము ఎంతో ఆరాధించే ఆ క్రికెటర్ ఓ బాలికను ఇంత కిరాతకంగా హింసించాడని తెలిసి దేశం నివ్వెరపోయింది. ఇదంతా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షాదత్ హుస్సేన్, అతని భార్య గురించి.
తమ ఇంట్లో పనిచేసిన 11ఏళ్ల మహఫుజా అక్తర్(హ్యాపీ) అనే బాలిక షాదత్ హుస్సేన్, అతని భార్య న్రిట్టో షాదత్ కలిసి తీవ్రంగా వేధించారు. ముద్దుగా హ్యాపీ అని పిలువబడే మహఫుజా అక్తర్ ను క్రికెటర్ వేధించాడనే విషయం ఇప్పుడు బంగ్లాదేశ్లో సంచలనం రేపుతోంది.

కాగా, హ్యాపీది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆమెకు తెలియదు. హ్యాపీని సాకుతున్న అమ్మమ్మ క్రికెటర్ ఇంట్లో ఆమెను పనికి కుదిర్చింది. అయితే ఆ ఇంట్లో తనని నిత్యం కర్రలతో, వంటగదిలోని సామాన్లతో కొట్టేవారని హ్యాపీ తెలిపింది. తనకు తినేందుకు కూడా ఏమి పెట్టకపోయేవారని, ఒక్కోసారి బాత్ రూంలో పెట్టి తాళం వేసే వారని చెప్పింది.
దెబ్బలను భరించలేక ఎవరూ చూడని సమయంలో ఆ ఇంట్లో నుండి పారిపోయి వచ్చింది. ముఖంపై గాయాలతో కన్పించిన హ్యాపీని గమనించిన మోజమ్మెల్ హుస్సేన్ అనే జర్నలిస్టు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిచారు.
ఈ ఉదంతం తెలిసి బంగ్లాదేశ్ బాలల హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. బాలికను చిత్ర హింసలకు గురిచేసిన సదరు క్రికెటర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాదత్ హుస్సేన్, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోనే నివాసముంటున్న వారికి ఓ చిన్న పాప ఉన్నందున మానవతా దృక్పథంతో డిసెంబర్ 1న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
29ఏళ్ల ఈ బంగ్లా బౌలర్ 2005లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 36 టెస్టులు, 51వన్డే అంతర్జాతీయ మ్యాచులాడిన షాహదత్ ప్రస్తుతం బంగ్లా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. షాహదత్ రెండు ఫార్మాట్లలో 100 వికెట్లు తీశాడు. కాగా, బాలికపై దాడి ఘటన నేపథ్యంలో బంగ్లా బోర్డు అతడ్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసింది.