మెగా వేలం ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ మహిపాల్ లోమ్రార్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీలో అజేయ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. డెహ్రాడూన్ వేదికగా ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో త్రిశతకంతో సత్తాచాటాడు. 360 బంతుల్లో అజేయంగా 300 పరుగులు చేశాడు. 25 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.
మహిపాల్ ట్రిపుల్ సెంచరీ, కార్తీక్ శర్మ సెంచరీతో విజృంభించడంతో రాజస్థాన్ 660/7 భారీ స్కోరు సాధించింది. అయితే గత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన మహిపాల్ లోమ్రార్ను ఆర్సీబీ విడిచిపెట్టింది. 25 ఏళ్ల ఈ ఆల్రౌండర్ బ్యాటుతో పాటు బంతితో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ పాత్రలో కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడిన మహిపాల్ 2024 సీజన్లో పూర్తిగా విఫలమయ్యాడు. 15 సగటుతో 125 పరుగులే చేశాడు.

రంజీ ట్రోఫీలో తిరిగి లయను అందుకుని తానెంత విలువైన ఆటగాడో మహిపాల్ చాటిచెప్పాడు. తనని తిరిగి వేలంలో దక్కించుకునేలా ఆర్సీబీని ఆకర్షించాడు. ఆర్సీబీ రూ.37 కోట్లు వెచ్చించి ముగ్గురు మాత్రమే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిది. విరాట్ కోహ్లికి రూ. 21 కోట్లు, రజత్ పటిదార్కు రూ.11 కోట్లు, యశ్ దయాల్కు రూ.5 కోట్లు అందించి రిటైన్ చేసుకుంది.
తమ పర్స్లో మిగిలిన రూ.83 కోట్లతో ఆర్సీబీ దాదాపు 22 మందిని వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంది.అందులో గరిష్టంగా 8 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవాల్సి ఉంది. డుప్లెసిస్ను వదులుకోవడం, దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీ ప్రధానంగా కెప్టెన్, వికెట్ కీపర్ పాత్రలను సమర్థవంతం పోషించే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించాలనుకుంటుంది. కాగా, ఆర్సీబీ వద్ద మూడు ఆర్టీఎమ్ కార్డ్లు ఉన్నాయి.