ముంబై: ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో తీరిక లేకుండా గడుపుతూనే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురికి పేరు ఖాయం చేసేశారు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో జన్మించిన తన ముద్దులు కూతురికి ధోనీ, సాక్షి దంపతులు జిబా అనే పేరు ఖరారు చేశారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి అందం అనే అర్థం ఉంది.
జీవితంలో తండ్రిగా కొత్త అవతారం ఎత్తిన ధోనీకి భారత జట్టు యాజమాన్యం శనివారం రాత్రి పెద్ద విందు ఇచ్చింది. ఈ సందర్భంగా జట్టు సహచరులకు తన చిన్నారి పేరును ధోనీ వెల్లడించాడు. నిజానికి, సాక్షి మార్చిలో బిడ్డను ప్రసవిస్తుందని అంచనా వేశారు. కానీ ఓ నెల ముందుగానే ఆమె పండంటి బిడ్డను కనేసింది.
33 ఏళ్ల ధోనీ తొలిసారి తండ్రి అయ్యాడు. సాక్షి ప్రసవం ఫోర్టిస్ ఆస్పత్రిలో సి - సెక్షన్ ద్వారా జరిగింది. దంపతులు కొన్నాళ్లుగా ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్టూట్ను సంప్రదిస్తూ వస్తున్నారు. ఆస్పత్రిలో వారు చివరి నిరుడు నవంబర్లో కనిపించారు.
నిజానికి, విదేశీ పర్యటనల్లో సాక్షి దోనీ వెంట ఉండేది. కానీ ఈసారి ఆస్ట్రేలియా పర్యటనకు ధోనీ ఒక్కడే వెళ్లాడు. తన బాల్య స్నేహితురాలు సాక్షి సింగ్ రావత్ను ధోనీ 2010 జులై 4వ తేదీన వివాహమాడాడు.