హైదరాబాద్: ఓటమి భయం వల్లే శ్రీలంక జట్టు సరైన ప్రదర్శన చేయలేకపోతుందని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం మహిళా జయవర్దనే అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం టీమిండియాతో ఐదు వన్డేల సిరిస్ ఆడుతున్న శ్రీలంక జట్టులో ఆ ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని జయవర్దనే అన్నాడు.
మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఆతిథ్య శ్రీలంక 3-0తో వైట్ వాష్కు గురైంది. ఈ సిరిస్కు ముందు జింబాబ్వే చేతిలో 2-3తో వన్డే సిరిస్లో కూడా ఓటమి పాలైంది.
ఇక, ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత్, శ్రీలంక మధ్య గురువారం పల్లెకలె వేదికగా రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో జయవర్దనె మీడియాతో మాట్లాడాడు. టెస్టు సిరీస్లో వైట్ వాష్ కావడంతో లంకేయుల స్థైర్యం దెబ్బతిందని, తప్పిదాలను వేగంగా దిద్దుకోలేకపోతే వన్డే సిరీస్ కూడా చేజార్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

"లంక జట్టు ఆత్మ స్థైర్యం బాగా దెబ్బతింది. జట్టులో ఓటమి భయం పట్టుకుంది. జట్టులోని ఆటగాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. జట్టులోని తప్పిదాలను గుర్తించి వేగంగా సరిదిద్దుకోలేకపోతే వన్డే సిరీస్ కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది" అని జయవర్దనే సూచించాడు.
టీమిండియా చేతిలో శ్రీలంక వైట్ వాష్కు గురవడంపై తమ జట్టు అన్ని విభాగాల్లో విఫలమైందని చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో తమకు అనుకూలంగా ఉన్న సందర్భాల్లో కూడా జట్టు విఫలమైందని అన్నాడు. ఇక, భారత్కు ఎనిమిది టెస్టు సిరిస్ విజయాలనందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై జయవర్దనే ప్రశంసల వర్షం కురిపించాడు.
'విరాట్ కోహ్లి క్రియాశీలక కెప్టెన్. అతను మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ఆదిలోనే కెప్టెన్గా అతనికి మెరుగైన ఆరంభం లభించింది. ఇప్పుడు భారత్లోనే కాదు.. విదేశీగడ్డపై కూడా ఆ విజయాల పరంపరని కొనసాగిస్తున్నాడు. జట్టులో అతనే ముందుండి తొలుత బాధ్యతలు తీసుకుంటున్నాడు. దీంతో మిగిలిన వాళ్లు కూడా.. అతడ్ని ఫాలో అవుతున్నారు' అని జయవర్దనే అన్నాడు.
'టెస్టుల్లో నెంబర్ వన్గా ఉన్న భారత్ జట్టుని ఓడించడం ఏ జట్టుకైనా సవాలే. సిరీస్ ఓటమితో ఇప్పటికే శ్రీలంక ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. తొలి వన్డేలో అది మరింత స్పష్టమైంది' అని జయవర్దనె వివరించాడు. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు.
'పరిమిత ఓవర్ల క్రికెట్లో పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో 130-140kmph వేగంతో బౌలింగ్ వేయగల సమర్ధుడు. అతడు ఉండటం జట్టుకు అదనపు బలం' అని జయవర్దనే అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాండ్యా సభ్యుడిగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకి జయవర్దనే కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే.