ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే నియమితుడయ్యాడు. ఈ మేరకు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుత కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కాంట్రాక్టు ముగియనుండడంతో జయవర్థనేను నియమిస్తున్నట్టు జట్టు యజమాని నీతా అంబాని తెలిపారు.
ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్లో ఆడిన పాంటింగ్.. గత రెండు సీజన్లలో ఆ జట్టు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. జాన్రైట్ నుంచి రికీ పాంటింగ్ బాధ్యతలు చేపట్టడం విశేషం. జట్టు మేనేజ్మెంట్తో సమావేశమయ్యేందుకు జయవర్ధనే త్వరలో ముంబై రానున్నాడు.

ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, కోచి టస్కర్స్ కేరళ జట్లకు జయవర్థనే ప్రాతినిధ్యం వహించాడు. కాగా, శ్రీలంక క్రికెట్ దిగ్గజాల్లో జయవర్దనే ఒకడు. 2007 వన్డే ప్రపంచ కప్ లో జయవర్ధనే సారథ్యంలో శ్రీలంక ఫైనల్ కు చేరింది. 2014లో టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న శ్రీలంక జట్టులో జయవర్థనే కీలక సభ్యుడు.
ఆధునిక క్రికెట్లో జయవర్ధనే గుర్తింపు పొందిన ఆటగాడని, అతడు ముంబై ఇండియన్స్ కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తాడని ఫ్రాంచైజీ యజమానురాలు నీతా అంబానీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కోచ్గా ఎంపిక కావడం పట్ల జయవర్ధనే హర్షం వ్యక్తం చేశాడు. జట్టుతో కలిసి పనిచేస్తానని, జట్టును విజయపథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కోచ్గా కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని తెలిపాడు.